
ఆస్ట్రేలియాతో ఆడే తొలి వన్డేలో ఆడే జట్టు గురించి టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అప్డేట్ ఇచ్చాడు. బంధువుల పెళ్లి ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన హార్దిక్.. తొలి వన్డేలో జట్టుకు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వస్తారని స్పష్టం చేశాడు.
శుక్రవారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా గిల్, కిషన్ వస్తారని పాండ్యా వెల్లడించాడు. అయితే వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయాస్ స్థానంలో ఎవరు ఆడతారని అతను చెప్పలేదు. అయితే నిపుణుల అంచనా ప్రకారం మూడో స్థానంలో కోహ్లీ, ఆ తర్వాత వరుసగా సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే జూన్ నెలలో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతను ఆడే అవకాశం ఉందా? అని రిపోర్టర్లు అడిగారు. దీనిపై చాలా స్పష్టంగా మాట్లాడిన పాండ్యా.. టెస్టు జట్టులో స్థానం కోసం తను కనీసం 10 శాతం కూడా కష్టపడలేదని, అలాంటప్పుడు తనకు అవకాశం ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. 'నేను ఎథికల్గా చాలా బలమైన విలువలు ఉన్నవాణ్ణి.
జట్టు అక్కడి వరకు చేరడానికి నేను 10 శాతం కాదు.. కనీసం ఒక్క శాతం కూడా ఏం చెయ్యలేదు. అలాంటప్పుడు వేరే వాళ్ల స్థానాన్ని నేను తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. టెస్టుల్లో ఆడాలని నేను అనుకుంటే.. కష్టపడి జట్టులో చోటు సంపాదిస్తా. అలా జరిగే వరకు టెస్టులకు నేను అందుబాటులో ఉండను' అని క్లారిటీ ఇచ్చేశాడీ ఆల్రౌండర్.