హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించిన హార్దిక్ పాండ్యా విండిస్ పర్యటనలో కూడా సత్తా చాటుతున్నాడు.
అటు బ్యాట్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా హార్ధిక్ పాండ్యా మంచి ఆల్ రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సెలక్టర్లకు నెంబర్ వన్ ఆల్ రౌండర్గా కనిపిస్తున్నాడు. నిలకడగా ఆడుతున్న పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విండిస్ పర్యటనలో ఐదు వికెట్లు తీశాడు.
మ్యాచ్లను ముగించడంలో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు ఉదాహరణే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఇంగ్లాండ్ వేదికగా ది ఓవల్ స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో భారత టాప్ ఆర్డర్ విఫలమైనా పాండ్యా ఒంటిచెత్తో వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు.

అయితే భారీ లక్ష్యం కావడంతో మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చలేకపోయిన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో ఇప్పటివరకు పాండ్యా ఆడిన నాలుగు వన్డేల్లో నిలకడగా ఆడినప్పటికీ, సరైన ఫినిషింగ్ మాత్రం ఇవ్వలేకపోయాడు.
తాజాగా ఆంటిగ్వాలో ముగిసిన నాలుగో వన్డేలో 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనితో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పాండ్యా 20 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వెంటనే వికెట్లు పడటంతో భారత్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దీంతో ఐదు వన్డేల సిరిస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్లో ఆఖరి వన్డే జులై 6 (గురువారం) కింగ్ స్టన్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరిస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే, విండిస్ మాత్రం సిరిస్ను సమం చేయాలని చూస్తోంది.
ఇప్పటికే కింగ్స్టన్ చేరుకున్న భారత జట్టు సబీన పార్కు మైదానంలో కసరత్తులు మొదలెట్టింది. దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, కుల్దీప్, అశ్విన్, ధోనీ, కోహ్లీతో పాటు పలువురు నెట్ సెషన్లో పాల్గొన్నారు. ఆఖరి వన్డే నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బుధవారం మీడియాతో మాట్లాడాడు.
విండిస్ పర్యటనలోని మ్యాచ్లు తనకు మంచి అనుభవాన్ని నేర్పించాయని, మున్ముందు భారత్ మ్యాచ్లను విజయవంతంగా ఫినిష్ చేసే బాధ్యతను తాను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. 'చివరి వన్డేలో విండీస్తో ఏమాత్రం తడబడకుండా ఆడతాను. ధోనీతో కలిసి ఆడే సమయంలో చాలా ఎంజాయ్ చేస్తా. అతని సలహాలు నాకు ఎంతో ఉపయోగపడతాయి. నా వరకు చివరి వన్డేలో అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తున్నా' అని పాండ్యా తెలిపాడు.
అనంతరం ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో అద్ఫుత ప్రదర్శన చేస్తున్న సమయంలో అనవసర పరుగుకి పోయి రనౌట్ అవడంపై పాండ్యా స్పందించాడు. 'ఆ సమయంలో తీవ్ర అసహనానికి గురయ్యాను. అది కేవలం మూడు నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత డ్రస్సింగ్ రూమ్లో ఔటైన తీరును చూసి నవ్వుకున్నాను. సహచర ఆటగాళ్లు సైతం నన్ను చూసి నవ్వారు' అని తెలిపాడు.