అసలేం జరిగింది?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.
తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు.
‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో
‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, కేఎల్ రాహుల్లపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్కు తిరుగు పయనం కానున్నారు. ఈ ఇద్దరిపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్కు తిరిగొచ్చి వీరిద్దరూ విచారణను ఎదుర్కోనున్నారు.
సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయం
తొలుత ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని భావించినప్పటికీ... చివరికు విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.