ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు సానుకూల ఫలితాలు రాకపోతే జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలిసింది. పైగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ ఎవరన్న విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాక.. వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం హార్దిక్ను వన్డేలకు కెప్టెన్గా నియమిస్తారని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు మంచిగా రాణిస్తే సారథ్య బాధ్యతలు ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
"హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్గా నియమించాలని అనుకున్నారు. కానీ.. రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ మాత్రం శుభ్మన్ గిల్ ను ఎంపిక చేశారు. అయితే టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్ గా ఉన్నప్పటికీ.. అతడి ఫామ్ ఇబ్బందికరంగా మారింది. కాబట్టి టీ20 కెప్టెన్సీని హార్దిక్ కు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన, ఫలితం పైనే కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలనేది ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీని అయినా హర్దిక్ కు ఇవ్వొచ్చు. ఎలాగో గిల్ డిప్యూటీగా ఉంటాడు. పైగా హార్దిక్కు అన్యాయం జరిగిందనే భావన.. బీసీసీఐలోని పలువురి సభ్యులకు ఉంది. అందుకే పాండ్యకు వన్డే బాధ్యతలు ఇస్తారు." అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

భారత్ శుభారంభం..
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కీలక వన్డే సిరీస్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించారు. బౌలింగ్లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశారు.