న్యూజిలాండ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ శనివారం టీమిండియాను ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే హార్దిక్ ను ఎందుకు ఎంపిక చేయలేదనే విషయంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. పాండ్యాను వన్డే సిరీస్కు దూరం పెట్టడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన 'వర్క్లోడ్ మేనేజ్మెంట్' అని బీసీసీఐ తెలిపింది.
ఒక వన్డే మ్యాచ్లో హార్దిక్ వరుసగా 10 ఓవర్లు బౌలింగ్ చేసేంత ఫిట్నెస్తో ప్రస్తుతం లేరని, వైద్య బృందం ఆయనకు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని సమాచారం. 2026లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని, హార్దిక్ కీలక ఆటగాడు కాబట్టి ఆయనపై ఒత్తిడి పడకుండా విశ్రాంతిని ఇచ్చారు. బుమ్రా విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు.

జట్టులో కీలక మార్పులు:
వెన్ను గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అంతేకాకుండా ఆయనకు వైస్ కెప్టెన్ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఆయన ఆడటం అనేది ఫిట్నెస్ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది.సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ వన్డే సిరీస్లో భాగమయ్యారు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీని మరోసారి సెలక్టర్లు పక్కన పెట్టారు. అలాగే దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్కు కూడా చోటు దక్కలేదు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.