వివాదాస్పద వ్యాఖ్యలపై
"వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. ఈ ఘటన జరిగిన తర్వాత వకాల్తా పుచ్చుకొని ఇష్టారీతిన కామెంట్లు చేయొద్దు. మరోవైపు గతంలో చోటుచేసుకున్న పొరపాట్ల గుర్తెరిగి ఆటగాళ్లు మసలుకోవాలి. భారత ఆటగాడిగా తమపై ఉన్న బాధ్యతల్ని ప్రతి ఒక్క ఆటగాడు మరువకూడదు" అని ద్రవిడ్ చెప్పాడు.
వ్యవస్థను తప్పుబట్టే విధంగా
ఒక్కో ఆటగాడు ఒక్కో నేపథ్యం నుంచి జట్టులోకి వస్తాడని, వ్యవస్థను తప్పుబట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ద్రవిడ్ అన్నాడు. కర్ణాటక సీనియర్ ఆటగాళ్లు, తల్లిదండ్రులు, పెద్దల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ద్రవిడ్ చెప్పాడు. చుట్టూ ఉన్నవారిని గమనించి మంచి విషయాలు అలవర్చుకున్నానని, తనకు మరెవరో వచ్చి పాఠాలు చెప్పేలా ఎప్పుడూ ప్రవర్తించనని అన్నాడు.
విచారణను ఎదుర్కొంటున్న పాండ్యా, రాహుల్
ప్రస్తుతం పాండ్యా, కేఎల్ రాహుల్లు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్మన్కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి.
పాండ్యా, రాహుల్లపై నిర్ణయం అంబుడ్స్మన్దే
అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్మన్ను నియమించలేమన్న సుప్రీం.. ఆటగాళ్లపై చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డుకే ఉంటుందని స్పష్టం చేసింది. మైదానంతోపాటు బయట ఉండే సవాళ్లపట్ల ఆటగాళ్లకు చక్కని అవగాహన కల్పించాల్సిన అవసరముందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఆటగాళ్ల ప్రవర్తనపై ఎన్సీఏలో ట్రైనింగ్
చాలా ఏళ్లుగా ఇండియా ఏ, అండర్ 19 క్రికెట్లో ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ట్రైనింగ్ ఉంటుందని, తీరికలేని షెడ్యూల్ వల్ల టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి ఎక్కువగా హాజరుకాలేక పోతున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.