ఢాకా: ఆసియా కప్లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్యా రాణించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. హార్దిక్ గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డాడు.
నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాడు. అతని బౌలింగ్ జట్టుకు కలిసి వచ్చిందని చెప్పాడు. తద్వారా తమకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు దొరికారన్నాడు. ఏడుగురు బ్యాట్సుమెన్ కావాలని భావించవచ్చునని, అయితే హార్దిక్ పటేల్ లాంటి వారు ఉంటే నష్టమేమిటన్నాడు.
అతని వల్ల మరో పదిహేను పరుగులు ఎక్కువగా వచ్చాయని అభిప్రాయపడ్డాడు. అతను గేమ్ చేంజర్ అన్నాడు. హార్దిక్ పాండ్యకు ఏం చెప్పవలసిన అవసరం లేదన్నాడు. అతనికి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలుసునని చెప్పాడు. మరిన్ని మ్యాచులు ఆడితో మరింత రాటుదేలుతాడని చెప్పాడు.

ఆరంభం ఎలా ఉంటుందో చూసి లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్నామని, రోహిత్ సరిగ్గా జట్టు అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడని ధోనీ చెప్పాడు. మనసులో ఏ భయమూ లేకుండా ఆడటం హార్దిక్ బలం అని చెప్పాడు. అతడో మంచి ఫీల్డర్ అని, అక్కరకొచ్చే మూడో సీమర్ కూడా అన్నాడు. అందుకే అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
కాగా, జట్టు 97/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పాండ్య పదునైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక దశలో రోహిత్ శర్మతో పోటాపోటీగా షాట్లు కొట్టాడు. రోహిత్తో అతడి భాగస్వామ్యమే భారత్కు భారీ స్కోరు అందించింది.