Hardik Pandya: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2025లోనూ అదరగొడుతోంది. ఈ సీజన్ లోని తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓటములతో నిరాశపరిచిన ఆ జట్టు.. ఆ తర్వాత అనూహ్యంగా పోటీలోకి వచ్చి ఇప్పుడు ఎదురులేని జట్టుగా నిలిచింది. వరుసగా ఆరో విజయాన్ని అందుకుంది. తాజా మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లిన ఆ జట్టు.. ప్లేఆఫ్స్ కు అతి దగ్గరగా వచ్చింది.
ఏడు కుట్లు..
అయితే ఈ మ్యాచు విజయంలో కీలకంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అసలైన నాయకుడని నిరూపించుకున్నాడు. దెబ్బతగిలినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మ్యాచు బరిలోకి దిగి జట్టును గెలిపించుకున్నాడు. రాజస్థాన్ పై తాజాగా జరిగిన మ్యాచులో అతడు.. తన ఎడమ కన్నుపై ఓ వైట్ టేప్ వేసుకుని, కంటికి కళ్లజోడు పెట్టుకుని ఆడాడు. అయితే అందుకు కారణం అప్పుడు తెలియలేదు. ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది. హార్దిక్ వైట్ టేప్ వేసుకోవడానికి కారణం అతడికి గాయమైంది. ట్రైనింగ్ సమయంలో లెఫ్ట్ కన్నుపై భాగంలో గాయమై ఏడు కుట్లు పడ్డాయి. అయినా కూడా అతడు విశ్రాంతి తీసుకోకుండా తాజా మ్యాచ్ ఆడాడు. కెప్టెన్ కమిట్ మెంట్ చూపించాడు.

బలమైన భాగస్వామ్యం..
ఈ మ్యాచులో హార్దిక్ రెచ్చిపోయి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి అలవోకగా షాట్లు బాదాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్కు 44 బంతుల్లోనే 94 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తంగా హార్దిక్.. 23 బంతుల్లో 6×4, 1×6 సాయంతో 48 నాటౌట్ పరుగులు చేశాడు. బంతితోనూ (1/2) రాణించాడు హార్దిక్.
కాగా, తాజా మ్యాచులో 100 పరుగుల తేడాతో గెలిచి.. వరుసగా ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ముంబై ఇండియన్స్. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని అందుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇదే సమయంలో ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ రన్రేట్ కూడా చాలా మెరుగైంది.