డబ్లిన్: క్రికెట్లో ఐర్లాండ్ పసికూనే అయినా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని టీమిండియా తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్కు అతను తొలిసారి టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఈ రోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్ మాట్లాడాడు.
'ఈ సిరీస్ మాకు మెంటల్గా చాలెంజ్. మేం ఐర్లాండ్తో ఆడుతున్నామని చెప్పడం తేలికైన విషయమే అయినా భారత జట్టు తరఫున ఆడటం అతిపెద్ద గర్వకారణం. అలాగే మేం ఈసారి ప్రపంచకప్ గెలవాలంటే ఇక్కడి నుంచి ఆడే ప్రతిఆట ముఖ్యమైనదే. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ అయినా.. మరే ఇతర పెద్ద సిరీస్ అయినా మేం ఒకే ఇంటెన్సిటీతో ఆడతాం. అలాంటిది.. ఇప్పుడు కూడా ఎంత బాగా ఆడతామన్నదే మానసికంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే రెండు మ్యాచ్ల్లో గెలవడం అంత తేలిక కాదు. కానీ, టీమిండియాకు ఆడుతున్నాం కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అది తప్పకుండా చేస్తాం' అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఈ సిరీస్లో ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా యువ ఆటగాళ్లతో కలిసి ఆడటంపై స్పందించిన అతను.. ఇలాంటి అవకాశం అదృష్టమని చెప్పాడు. టీమిండియా ఒకేసారి రెండు జట్లను ఆడించాల్సి వస్తే.. తమ రిజర్వ్ బెంచ్ అంత బలంగా ఉండటం అదృష్టమని చెప్పాడు. దీంతో చాలా మంది యువ క్రికెటర్లకు బరిలోకి దిగి తమ సత్తా చాటే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్లో అవకాశాలు రాని ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, అలాంటి వారికి టీమిండియా తరఫున ఆడటం పెద్ద కల అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
"మేము ఈ మ్యాచ్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. అదే విధంగా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగాలని భావిస్తున్నాము. ప్రస్తుత జట్టు పరిస్థితుల బట్టి ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఈ సిరీస్లో మంచి ఫలితాన్ని తీసుకురావడంపై నా దృష్టంతా ఉంది" అని హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు.