
అసలేం జరిగింది?
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు దిశగా వెళ్తున్న సమయంలో క్రీజులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. 40వ ఓవర్లో రూం తీసుకొని ఆడే ప్రయత్నం చేశాడతను. అతను ఆడిన కట్ షాట్ బంతికి కనెక్ట్ కాలేదు. అతను ఆ డెలివరీని మిస్ చేశాడు. ఆ బంతి వికెట్ల మీదుగా వెనక్కు వెళ్తోందని స్పష్టంగా కనిపించింది. కానీ కివీస్ ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేశారు. దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లింది. అప్పటికి హార్దిక్ 38 బంతుల్లో 28 పరుగులతో మంచి టచ్లో కనిపించాడు. భారీ స్కోరు చేసే దిశగా సాగుతున్నాడు.

అంపైర్ షాకింగ్ నిర్ణయం
బంతి వికెట్ల మీదుగా వెళ్తోందని స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అంపైర్ షాకింగ్ నిర్ణయం ఇచ్చాడు. అంటే, బంతి తగలకపోయినా.. కీపర్ లాథమ్ తనే వికెట్లపై ఉండే బెయిల్స్ను పడగొట్టాడు. అయినా సరే థర్డ్ అంపైర్ మాత్రం హార్దిక్ అవుట్ అని నిర్ణయం వెల్లడించాడు. ఇది చూసిన అభిమానులు నోరెళ్లబెట్టారు. అది అసలు ఎలా అవుట్ అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే అన్ని వివాదాస్పద నిర్ణయాల వలెనే దీనికి కూడా ఎలాంటి సమాధానం లేకుండా పోయింది.

అదెలా అవుట్?
దీనిపై హార్దిక్ పాండ్యా భార్య నటాషా కూడా నోరెళ్లబెట్టింది. తన భర్త అవుట్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్ మీడియాలో పంచుకుంది. వీటితోపాటు 'అక్కడ బ్యాట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, బౌల్డ్ అవ్వలేదు. అలాంటప్పుడు అది అసలు అవుట్ ఎలా అవుతుంది?' అని ప్రశ్నించింది. అభిమానులు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. పాండ్యాను అసలు ఏ బేసిస్ మీద అవుట్ అని నిర్ణయించారని నిలదీస్తున్నారు. అయితే అంపైర్ల నుంచి దీనిపై వివరణ రాలేదు.

గిల్ విషయంలో కూడా
కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ ఇదే మ్యాచ్లో అంతకుముందు కూడా ఇలాగే చీటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. శుభ్మన్ గిల్ ఆడుతుండగా బంతి తగలకుండానే వికెట్లను కూల్చాడు. అయితే గిల్ విషయంలో ఇది బయట పడటంతో అతను తప్పించుకున్నాడు. కానీ పాండ్యా మాత్రం ఈ మోసానికి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా కావాలనే టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తుండగా వికెట్లను కూల్చి ప్రాంక్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












