
హైదరాబాద్: టీమిండియా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యారు. 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట నిర్వహించనున్న మ్యాచ్లో ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్తో వెస్టిండీస్ జట్టు తలపడబోతోంది. మే 31న లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్లోని పలు స్టేడియాలు నేలమట్టమవగా... వాటిని పునర్మించేందు చారిటీ మ్యాచ్ నిర్వహించి విరాళాలు సేకరించాలని ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ తపానుల కారణంగా కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి.
వీటిని పునరుద్ధరణ పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐసీసీ వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అప్ఘనిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ తాజాగా భారత్ నుంచి పాండ్యా, కార్తీక్లకు అవకాశం కల్పించింది.
ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లో గతకొంత కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న పాండ్యా, కార్తీక్.. టోర్నీ ముగియగానే లండన్ వెళ్లనున్నారు. వరల్డ్ ఎలెవెన్ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లు ఆడుతుండటంపై ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్న గైల్స్ క్లార్క్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ త్వరలోనే మిగతా ఆటగాళ్లను ఎంపికచేయనుంది. ఈ వరల్డ్ ఎలెవెన్ జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా మోర్గాన్ మాట్లాడుతూ 'ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడల్లా క్రికెట్ కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టీ20 మ్యాచ్ ప్రేక్షకులను అలరిస్తుంది' అని మోర్గాన్ తెలిపారు.
మరోవైపు, వరల్డ్ ఎలెవన్ ఢీకొనబోతున్న 13 మంది సభ్యులతో కూడిన వెస్టిండిస్ జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్వైట్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రసెల్ వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు.
వెస్టిండీస్ జట్టు:
కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), శామ్యూల్ బద్రీ, రయద్ ఎమ్రిట్, ఆండ్రూ ఫ్లెచర్, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, అష్లే నర్స్, కీమో పాల్, రోవ్మన్ పాల్, దినేశ్ రామ్దిన్ (కీపర్), ఆండ్రూ రసెల్, మార్లోన్ శామ్యూల్స్, కెస్రిక్ విలియమ్స్