పాపం.. హార్దిక్ పాండ్య! అతనికి టైమ్ ఏ మాత్రం కలిసిరావట్లేదు. ఒక్కసారిగా కెరీర్, వ్యక్తిగత జీవితంలో కష్టాలు చుట్టుముట్టాయి. తానే భవిష్యత్ భారత్ కెప్టెన్ అని మొన్నటివరకు చెప్పిన బీసీసీఐ ఇప్పుడు రోహిత్కు కొత్త వారసుడిని ప్రకటించింది. అంతేకాదు, హార్దిక్ను కనీసం వైస్కెప్టెన్గా కూడా ఎంపికచేయలేదు. మరోవైపు తన భార్య నటాషాతో విడిపోవాల్సి వచ్చింది.
టీ20 వరల్డ్ కప్ విజయంతో తిరిగి తన లైఫ్ మళ్లీ చక్కపడుతుందని అనుకున్న సమయంలో హార్దిక్కు వరుసగా ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హార్దిక్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. దీంతో హార్దిక్ ధైర్యంగా ఉండాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడే కాదు, గత కొన్ని నెలలుగా హార్దిక్ పాండ్యనే హాట్ టాపిక్గా మారాడు. మీడియా, సోషల్ మీడియాలో అతని గురించే చర్చ సాగింది.

వన్డే వరల్డ్ కప్-2023లో గాయపడటంతో సాఫీగ సాగే అతని జీవితం మలుపు తిరిగింది. ఈ స్టార్ ఆల్రౌండర్ టీమిండియాకు దూరమయ్యాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేసుకోవడంతో తిరిగి పోటీ క్రికెట్ ఆడటానికి నెలలు పాటు వేచి ఉన్నాడు. ఎట్టకేలకు తిరిగి ఫిట్నెస్ సాధించుకున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్కు చేర్చి, ఓ సారి ఛాంపియన్గా జట్టును నిలిపిన హార్దిక్ పాండ్య గుజరాత్ ఫ్రాంచైజీని వీడాడు. తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు.
అంతేగాక రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన విషయమైనప్పటికీ రోహిత్, ముంబై అభిమానులు హార్దిక్ను దారుణంగా మైదానంలో, బయటా అవమానించారు. ఇదిలా జరుగుతుండగా తన వ్యక్తిగత జీవితంతో ప్రకంపనలు మొదలయ్యాయి. అయినప్పటికీ ప్రేక్షకుల హేళనలు, అవమానాలు తట్టుకుంటూ మైదానంలో నవ్వుతూ ముందుకు సాగాడు. ముంబై జట్టులో సహచరుల నుంచి ఆశించినంత సహకారం లభించకపోయినా మౌనంగా ఉండిపోయాడు.
టీ20 వరల్డ్ కప్లో తిరిగి టీమిండియా జెర్సీ ధరించాడు. తానంత విలువైన ఆటగాడు ప్రపంచ వేదికపై నిరూపించాడు. బౌలింగ్, బ్యాటింగ్తో భారత జట్టును ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించాడు. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా విమర్శించిన వాళ్లతోనే జైకొట్టించుకున్నాడు. ఈ క్రమంలో ఫైనల్లో విజయానంతరం హార్దిక్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో తన బాధను వెల్లగక్కాడు.
మరోవైపు రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్దిక్ పూర్తిస్థాయిలో పొట్టి ఫార్మాట్లో టీమిండియా బాధ్యతలు అందుకుంటాడని భావించారంతా. కానీ బీసీసీఐ షాక్ ఇచ్చింది. నయా కోచ్ గంభీర్, సెలక్టర్లు, రోహిత్ శర్మ లేదా జట్టులోని సభ్యుల ఆటగాళ్ల నిర్ణయమో తెలియదు కానీ.. హార్దిక్పై వేటు వేశారు. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. దీంతో హార్దిక్ మరోసారి బాధను దిగమింగుతూ మళ్లీ నవ్వుతూ పోరాడాల్సిన సమయం వచ్చిందని స్టార్ ఆల్రౌండర్కు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.