

నాటింగ్హామ్: రెండు టెస్టుల పరాజయం తర్వాత మూడో టెస్టుల్లో అద్భుతంగా రాణించి భారీ ఆధిక్యంతో గెలుపొందింది టీమిండియా. ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జరుగుతున్న సిరీస్లో 1-2 ఫలితాన్ని సాధించి ఇంగ్లాండ్కు ఆధిక్యాన్ని తగ్గించింది. బుధవారం ముగిసిన మూడో టెస్టులో విరాట్ కోహ్లి తనకి లభించిన 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని హార్దిక్ పాండ్యాతో పంచుకోవాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.
ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 97 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులతో మెరిశాడు. దీంతో.. భారత్ జట్టు 203 పరుగుల భారీ తేడాతో గెలవగా.. విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ఆ అవార్డు దక్కింది. అయితే.. కోహ్లీతో పాటు ఈ టెస్టులో మెరుగ్గా రాణించిన హార్దిక్ పాండ్యా కూడా ఆ అవార్డుకి అర్హుడని సచిన్ అభిప్రాయపడ్డాడు.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 28 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన హార్దిక్ పాండ్య.. రెండో ఇన్నింగ్స్లో 52 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో వేగంగా 52 పరుగులు చేశాడు. 'నేనైతే.. మూడో టెస్టు విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఇద్దరికీ ఆ అవార్డుని పంచేవాడ్ని. మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్లూ చాలా కీలకం. మొదటి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు భారత్ విజయానికి పునాది వేస్తే.. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు దోహదపడింది.'
'హార్దిక్ పాండ్య కూడా తొలి ఇన్నింగ్స్లో అతను తీసిన ఐదు వికెట్లు మ్యాచ్లో కీలకమలుపు. ఫామ్లో ఉన్న జో రూట్, బెయిర్స్టో లాంటి వికెట్లను అతను పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లోనూ వేగవంతంగా అర్ధశతకం బాదాడు. అతని జోరుతోనే భారత్ 500+ టార్గెట్ను ఆతిథ్య జట్టు ముందుంచగలిగింది' అని సచిన్ వెల్లడించాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఈ నెల 30 నుంచి జరగనుంది.