హైదరాబాద్: ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ప్రశంసలు కురిపించాడు. పాండ్యా హిట్టర్ మాత్రమే కాదని, పరిస్థితులకు అర్థం చేసుకుని ఆడగల సత్తా ఉన్న క్రికెటర్ అని కొనియాడాడు.
గురువారం బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాండ్యా 41 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
'పాండ్యeని నాలుగో స్థానంలో క్రీజులోకి పంపడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఏడో స్థానంలో రావాలని కోరుకుంటున్నారు. పాండ్య హిట్టింగ్ చేస్తాడన్న ఆలోచనతోనే ఇలా మాట్లాడుతున్నారు. కానీ అతడు హిట్టర్ మాత్రమే కాదు, జట్టు పరిస్థితులను అంచనా వేసుకుని ఆడగల సామర్థ్యం ఉన్నవాడు' అని కోహ్లీ అన్నాడు.

'పాండ్యాలో ఆ సత్తా ఉంది. అందుకే అతడిని నాలుగో స్థానంలో క్రీజులోకి పంపిస్తున్నాం. హార్దిక్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోనే సత్తా ఉన్న క్రికెటర్. మూడు, నాలుగు వన్డేల్లో ఇది రుజువైంది' అని కోహ్లీ తెలిపాడు. మరోవైపు నాలుగో వన్డేలో ధోని స్ధానంలో పాండ్యా రావడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీని ముందు పంపకుండా మనీష్ పాండేను పంపడంపై భారత క్రికెట్ అభిమానులు సీరియస్ అయ్యారు. అసలు కెప్టెన్ కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'ధోనిని ఇంకా లోయర్ మిడిలార్డర్లోనే పంపిస్తావా?' అని ఒక నెటిజన్ ప్రశ్నించగా... 'ధోనిని 4 లేదా ఐదో స్థానంలో ఆడనీయవా' అంటూ మరొక నెటిజన్ స్పందించాడు. 'నెక్ట్స్ టైమ్ ధోనీని 11వ స్థానంలో పంపించు' అంటూ మరొక అభిమాని విరాట్ కోహ్లీకి చురకలంటించారు.