హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్ మ్యాచ్లో పాల్గొనే భారత ఏ జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత ఏ జట్టుకు టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
మంగళవారం సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఈ మధ్య కాలంలో రంజీ ట్రోఫీలో రాణించిన అనేక మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆసీస్తో ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడే భారత్ ఏ జట్టులో హైదరాబాద్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. 22 ఏళ్ల సిరాజ్ ఈ రంజీ సీజన్లో 9 మ్యాచ్లాడి 41 వికెట్లు తీసుకున్నాడు.

మరోవైపు ఈ రంజీ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన ప్రియాంక్ పంచల్, సర్వీసెస్ బ్యాట్స్మన్ రాహుల్ సింగ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, బాబా ఇంద్రజిత్ వంటి ఆటగాళ్లు భారత ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు వార్మప్ మ్యాచ్ జరగనుంది.
ఈ వార్మప్ మ్యాచ్ కోసం రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23న పుణెలో ప్రారంభం కానుంది.
భారత్ ఏ జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అఖిల్ హెర్వాద్కర్, ప్రియాంక్ పంచల్, శ్రేయస్ అయ్యర్, అకింత్ బావ్నె, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), షాబాజ్ నదీమ్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైని, అశోక్ దిండా, రాహుల్ సింగ్, బాబా ఇంద్రజిత్.