కొన్ని రోజుల క్రితం భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ సమయంలో చాలా మంది మాజీలు టీమిండియా సెలెక్షన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరేమో హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ అవసరం టీమిండియాకు ఉందని, అతను టెస్టులు కూడా ఆడితే బాగుంటుందని అన్నారు.
మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే మాట అన్నాడు. 'పాండ్యా నా మాటలు వింటుంటే.. నువ్వు టెస్టు క్రికెట్ ఆడాలి. అదే నా కోరిక' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే అది అసాధ్యం అని మాజీ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. తన కెరీర్లో గాయాలకు చాలా సమయం వేస్ట్ చేసుకున్న హార్దిక్.. గతేడాది పునరాగమనంలో అదరగొట్టాడు. మంచి ఫామ్ కనబరిచాడు. ఐపీఎల్లో కెప్టెన్గా తన మార్కు చూపించాడు.

దీంతో అతనికి టీమిండియా టెస్టు జట్టు పగ్గాలు అందించడంతోపాటు వన్డేల్లో అతన్ని వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. రోహిత్కు డిప్యూటీగా సేవలు అందించిన అతను.. అధికారికంగా కాకపోయినా టీమిండియా టీ20 కెప్టెన్గా పర్మినెంట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ టెస్టు కెరీర్పై క్లారిటీ ఇచ్చేశాడు.
'ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. హార్దిక్ పాండ్యా శరీరం.. టెస్టు క్రికెట్ను తట్టుకోలేదు. అది అతని వల్ల కాదు' అని తేల్చి చెప్పేశాడు. అదే సమయంలో వన్డే, టీ20 క్రికెట్కు అతను సరిగ్గా సూట్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ వరకూ టీమిండియాకు రోహిత్ కెప్టెన్గా కొనసాగుతాడని, అయితే ఆ తర్వాత మాత్రం జట్టు పగ్గాలు పాండ్యాకే దక్కుతాయని జోస్యం చెప్పాడీ మాజీ లెజెండ్. వరల్డ్ కప్ వరకు జట్టుకు రోహితే కెప్టెన్ అని, ఆ తర్వాత మాత్రం పాండ్యాను కెప్టెన్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పేశాడు.