టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి క్రికెట్ విషయాల్లో కాకుండా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి వార్తల్లోకెక్కాడు. భార్య నటాషాతో హార్దిక్కు విభేదాలు ఏర్పడ్డాయని, వారిద్దరు విడిపోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2018లో వారిద్దరికీ పరిచయడం ఏర్పడగా, గతేడాది అంగంరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
దాదాపు ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో హార్దిక్-నటాషాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో హార్దిక్ పాండ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వేడుక తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఓ ఏడాది తర్వాత హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో నటాషా పేర్కొంది. హార్దిక్కు కొనియాడుతూ పోస్ట్లు పెట్టింది.

అయితే 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు. సముద్ర జలాల మధ్య నటాషాను ప్రపోజ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్-నటాషా డేటింగ్లో ఉన్నారు. ఆ ఏడాది లాక్డౌన్లో తాము తల్లిదండ్రులు అయ్యామని తెలిపారు. 2020 జులైలో ఆగస్త్యకు జన్మనిచ్చారు. అయితే వారిద్దరు వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 13న పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత హార్దిక్-నటాషా జీవితం మరింత సంతోషంలో మునిగింది.
కానీ తాజాగా నటాషా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో హార్దిక్ పేరు తొలగించడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం మొదలైంది. విడిపోతున్నారని కథనాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నటాషా కొద్దికాలం నుంచి తక్కువగా పోస్ట్లు పెడుతుండటంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.
అయితే ఈ వార్తల వస్తున్న నేపథ్యంలో నటాషా పరోక్షంగా స్పందించారు. వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. హార్దిక్తో సంతోషంగా ఉన్నట్లు ఇండైరెక్ట్గా పోస్ట్లో వెల్లడించి ఊహాగానాలకు తెరదించారు. ముంబై ఇండియ్స్ జట్టు పగ్గాలను అందుకోవడంతో రోహిత్ అభిమానుల నుంచి హార్దిక్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ ఫ్యామిలీ సోషల్ మీడియాకు దూరంగా ఉంది.