ఐపీఎల్-2024 సీజన్ను విజయంతో ముగించాలనుకున్న ముంబై ఇండియన్స్కు నిరాశే మిగిలింది. ఆఖరి మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొత్తంగా కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఈ సీజన్ను ముగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో, 5x4, 8x6), కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో, 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. నువాన్ తుషారా (3/28), పీయూష్ చావ్లా (3/29) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో, 10x4, 3x6), నమన్ ధిర్ (62*; 28 బంతుల్లో, 4x4, 5x6) పోరాడారు. రవి బిష్ణోయ్ (2/37), నవీనుల్ (2/50) తలో రెండు వికెట్లు తీశారు.

అయితే ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఓ ఐపీఎల్ సీజన్లో 10 మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వడం ముంబైకు ఇది రెండోసారి. 2022 సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై పది మ్యాచ్ల్లో ఓడింది. ఇప్పుడు ఆ రికార్డును నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య సమం చేశాడు. ఈ సీజన్లోనూ ముంబై పది మ్యాచ్ల్లో ప్రత్యర్థి చేతిలో ఓడింది. దీంతో ఓ సీజన్లో అత్యధిక ఓటములు చవిచూసిన ముంబై కెప్టెన్లగా రోహిత్తో కలిసి హార్దిక్ అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్-2020లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ముంబై వరుసగా నిరాశపరుస్తోంది. 2021, 2022లో లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది. గత సీజన్లో ప్లేఆఫ్స్కు వెళ్లినప్పటికీ టైటిల్ సాధించలేకపోయింది. దీంతో అయిదు సార్లు జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు జట్టు బాధ్యతలు అందించారు. కానీ ముంబై కథ మారలేదు.