
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 211పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (76పరుగులు 48బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసం రేపగా.. చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (29పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31పరుగులు 12బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) దడదడలాడించారు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ ప్రవర్తన కాస్త విడ్డూరంగా అనిపించింది. అసలు కథ ఏంటంటే?
ఇక ఈ మ్యాచ్లో 17వ ఓవర్లో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. 18వ ఓవర్లో హార్దిక్ ఫోరు, సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. ఇక చివరి ఓవర్ నార్జ్ వేయగా తొలి బంతికి పంత్ ఔటయ్యాడు. ఇక వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 18బంతుల్లో 46పరుగులుగా నమోదైంది. ఇక పంత్ ఔటవ్వడంతో క్రీజులోకి ఫినిషర్ దినేష్ కార్తీక్ వచ్చాడు. రెండో బంతి ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ ఎలాంటి పరుగులు రాబట్టలేదు. మూడో బంతికి 1రన్ వచ్చింది.
నాలుగో బంతికి హార్దిక్ సిక్స్ బాదాడు. ఇక అయిదో బంతికి హార్దిక్ యార్కర్ ఎదుర్కొన్నాడు. ఆ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా హార్దిక్ ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశమున్న అవతలి ఎండ్లో ఉన్న దినేష్ కార్తీక్ను రావొద్దన్నాడు. తానే స్ట్రైక్ ఉంచుకున్నాడు. ఇక దినేష్ కార్తీక్ లాంటి దిగ్గజ ఫినిషర్కు సింగిల్ తీసి ఇవ్వకపోవడంపై హార్దిక్ మీద విమర్శలొస్తున్నాయి. ఇక చివరి బంతికి హార్దిక్ కేవలం 2పరుగులు మాత్రమే తీశాడు. దినేష్ కార్తీక్ లాంటి స్పెషలిస్టు ఫినిషర్ అవతలి ఎండ్ లో ఉన్నప్పుడు సింగిల్ వచ్చే అవకాశమున్న హార్దిక్ వద్దనడం విడ్డూరంగా అనిపించింది. దినేష్ కార్తీక్ ఏదో 10వ నంబర్ బ్యాటర్ అయినట్లు హార్దిక్ వ్యవహరించడం సరికాదని కామెంట్లొస్తున్నాయి.