మొహాలీలో జరిగిన టీ20లో ఓటమికి జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడమే కీలక కారణమని భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇకపోతే బుమ్రా లేక భారత బౌలింగ్ ఔట్ఫిట్ మరోసారి పేలవంగా కన్పించింది. 208పరుగుల భారీ స్కోరును కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మ్యాచ్ చివరి ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు లీక్ చేశారు. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ గెలుపొందింది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పాండ్యా మాట్లాడుతూ.. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమైన ప్లేయర్.
అయితే అతను గాయం నుంచి తిరిగి కోలుకుని జట్టులో ఎంట్రీ ఇవ్వడానికి తగినంత సమయం ఇవ్వాలని అన్నాడు.'జస్ప్రీత్ జట్టులో లేకపోవడం జట్టు పరంగా చాలా పెద్ద మార్పునిస్తుంది. అతను గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను తిరిగి పూర్తిగా రెడీ కావడానికి తగినంత టైం దక్కడం చాలా ముఖ్యం. అతనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అతను జట్టుకు ఏమి చేయగలడో.. జట్టుకు ఎంత ముఖ్యమైనవాడో మనందరికీ తెలుసు. జట్టు విషయంలో బౌలింగ్ గురించి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. కానీ అవి సమసిపోతాయి.
మేము మా ప్లేయర్లను విశ్వసిస్తున్నాం. దేశంలో అత్యుత్తమ 15మంది క్రికెటర్లు కాబట్టే వాళ్లు జట్టులో ఉన్నారు' అని హార్దిక్ చెప్పాడు. ఇకపోతే బ్యాటింగ్ టైంలో కేవలం 30బంతుల్లోనే 71పరుగులు చేసిన హార్దిక్ అత్యుత్తమ ఆటతీరుతో అలరించాడు. అతను తన రెండు ఓవర్లలో వికెట్లు తీయలేకపోయినప్పటికీ.. పాండ్యా తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
'ఇటీవల నేను చాలా బాగా ఆడగలుగుతున్నాను. కానీ నాకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజుల్లో నేను మరింత ఎలా మెరుగుపడగలను? నేను కలిగి ఉన్న కెరీర్ గ్రాఫ్, నా గురించి పెద్దగా ఊహించుకోకుండా ముందుకు సాగాలి. ఈ మ్యాచ్లో నేను మంచి ప్రదర్శనను కలిగి ఉన్నాను. తదుపరి గేమ్లో వాళ్లు నన్ను లక్ష్యంగా చేసుకోవచ్చు. నేను వారిని అడ్డుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయాలి' అని పాండ్యా ముగించాడు.