ముంబై: వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత 'ఎ' జట్టుకు, న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోమవారం వాంఖడేలో భారత జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి నెట్స్లో కష్టపడ్డాడు. కోచ్ భరత్ అరుణ్ ఆధ్వర్యంలో సాధన చేసి చెమటోడ్చాడు. బీసీసీఐ బోర్డు నుంచి పాండ్యాకు ఎలాంటి ప్రత్యేక సూచనలు లేకున్నా.. తన ఫిట్నెస్ స్థాయిని పరీక్షించుకునేందుకే అతను సాధన చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
వైరల్ వీడియో.. 'సెనోరిటా' పాటకు గంగూలీ డాన్స్!!
పాండ్యా త్వరలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటనలో ఇండియా ఏ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆదివారం రాత్రి అతడిని ఆ జట్టు నుంచి తప్పించారు. పాండ్యా స్థానంలో విజయ్ శంకర్కు చోటు కల్పించారు. ఇక ఫిట్నెస్ టెస్టులో విఫలమైన కారణంగా కివీస్ పర్యటనకు అతని పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. యోయో టెస్టులో పాండ్యా విఫలమయ్యాడనే అలా చేశారని సమాచారం.
అయితే పాండ్యాకు ఎలాంటి పరీక్షలు (యోయో టెస్టు) నిర్వహించలేదని ఒక బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. 'నిజానికి పాండ్యా బౌలింగ్పై ఒక ప్రత్యేక కార్యశాల నిర్వహించాం. అందులో తన స్థాయికి తగిన రీతిలో బౌలింగ్ చేయలేకపోయాడని పాండ్యానే భావించాడు. ఎవరైనా ఆటగాడు గాయం నుంచి కోలుకున్నాక అతడి స్థాయిని బట్టి ఒక పరీక్ష జరుగుతుంది. అందులో ఆ ఆటగాడి వేగం, కచ్చితత్వం తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. తాజాగా నిర్వహించిన ఈ పరీక్షలో పాండ్యా అనుకున్నట్లు రాణించలేకపోయాడు. దీంతో అతడే స్వతహాగా తప్పుకున్నాడు' అని తెలిపారు.
త్వరలో ప్రారంభమయ్యే ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో న్యూజిలాండ్తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ సెలక్షన్ కమిటి ఆదివారం రాత్రి జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ ప్రకటించింది. న్యూజిలాండ్ టూర్లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనికి పాండ్యా ఫిట్నెస్ వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది.