లండన్: కెమెరా కంటికి కనిపించకుండా చేసిన ప్రాక్టీస్, ఫిట్నెస్ ప్రస్తుతం మంచి ఫలితాలను అందిస్తోందని డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. నాటింగ్హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీయడం ద్వారా తన కెరీర్లో రెండోసారి ఈ ఘనత సాధించాడు.
రెండో ఇన్నింగ్స్లో 521 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆతిథ్య ఇంగ్లాండ్ను బుమ్రా తన పదునైన బంతులతో కష్టాల్లోకి నెట్టడంతో పాటు కీలక సమయంలో వికెట్లు(5/85) తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్టు మ్యాచ్ విజయం అనంతరం బుమ్రా మాట్లాడాడు.
"నా అరంగేట్రం ఫస్ట్క్లాస్ మ్యాచ్లో తొలి స్పెల్లోనే నేను 10 ఓవర్లు వేశాను. రంజీ ట్రోఫీలో ఎప్పుడూ చాలా ఓవర్లు విసిరేవాడిని. అదే నాకిప్పుడు సాయం చేసింది. గాయపడ్డప్పుడు నా ఫిట్నెస్, శిక్షణపై దృష్టిపెట్టాను. ఎవ్వరికీ ఏదీ అంత సులువుగా దక్కవు. చాలా కష్టపడాలి. అప్పటి కష్టమే ఇలాంటి సమయాల్లో మనకు విజయాల్ని అందిస్తుంది" అని అన్నాడు.
"అప్పట్లో మేం కెమెరాలకు దూరంగా పడిన కష్టమే ఈరోజు మంచి ఫలితాలను ఇస్తోంది. తెలుపు బంతితో పోలిస్తే ఎరుపు బంతి క్రికెట్లో ఓర్పు, నిలకడ చాలా అవసరం. మూడో టెస్టులో ఇంగ్లాండ్తో నాలుగో రోజు వాటిపై దృష్టి నిలిపా. నేనెప్పుడూ మంచి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరి బ్యాట్స్మెన్కు సవాల్ విసరాలని ప్రయత్నిస్తా" అని బుమ్రా తెలిపాడు.
"అలా చేయడం వల్లే చివర్లో మనకు వికెట్లు లభిస్తాయి. జోస్ బట్లర్ చాలా దూకుడుగా ఆడాడు. నిలదొక్కుకుంటే అతడిని ఔట్ చేయడం కష్టం. ఈ మ్యాచ్లో అతడిని ఔట్ చేసేందుకు నా బలాబలాలపైనే దృష్టి సారించా. అదే బట్లర్ వికెట్ తీసేలా చేసింది. అప్పటి వరకు పాత బంతితోనూ స్థిరంగా బౌలింగ్ చేశాం. కొత్త బంతికి సీమ్ తోడైంది. గాయపడ్డప్పటికీ నెట్స్లో ప్రాక్టీస్ చేశా. ఫిట్నెస్పై దృష్టిపెట్టా" అని బుమ్రా అన్నాడు.