
గతేడాది చివర్లో ఇంటికి వెళ్తూ యాక్సిడెంట్కు గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను మాజీ ఆటగాళ్లు కలిశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతన్ని టీమిండియా మాజీ దిగ్గజాలు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, శ్రీశాంత్ కలిశారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలవనుండగా.. వీళ్లు ముగ్గురూ ఐపీఎల్ కామెంటరీ చేస్తారని తెలిసిందే. కానీ ఈ యాక్సిడెంట్ కారణంగా పంత్ ఈసారి ఐపీఎల్లో ఆడటం లేదు. అతన్ని తాము కచ్చితంగా మిస్ అవుతామని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రకటించింది.
ఇలా పంత్ను కలిసిన ఫొటోలను ఈ ముగ్గురూ తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. హర్భజన్ సింగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'త్వరగా కోలుకో బ్రదర్.. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది' అని పోస్టు చేశాడు. అభిమానులు కూడా పంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రార్ధనలు చేస్తున్నారు. ఆస్పత్రిలో కొంత కోలుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉంటున్న పంత్.. తన రికవరీకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
సురేష్ రైనా కూడా పంత్ను కలిసిన ఫొటోలను నెట్టింట పంచుకున్నాడు. 'సౌభ్రాతృత్వమే అంతా.. మన మనసు ఎక్కడుంటే అదే మన కుటుంబం. మా తమ్ముడు రిషభ్ పంత్ బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని రైనా ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం మరో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ కూడా పంత్ను కలిసిన సంగతి తెలిసిందే. 'మళ్లీ తప్పటడుగులు వేస్తున్నాడు. ఇంత పాజిటివ్గా ఉండే మనిషిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు' అని యువీ ట్వీట్ చేశాడు.
'రిషభ్ పంత్ ఐ లవ్ యూ బ్రదర్.. నిన్ను నువ్వు నమ్ముతూ అందరిలో స్ఫూర్తి నింపు. మనిద్దరం ఒకే ధర్మానికి చెందిన బిడ్డలం. ఎందుకంటే ఈ మతాలన్నీ కూడా ఒకే దేవుడి చేతి వేళ్ల వంటివి కదా. ఆ చెయ్యి అందరినీ కాపాడేందుకు ప్రయత్నిస్తుంది' అని తన ఇన్స్టాగ్రాంలో శ్రీశాంత్ పోస్టు పెట్టాడు. ఈ ఫొటోలు, మెసేజ్లు చూసిన అభిమానులు కూడా పంత్పై తమ ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. అతను త్వరగా కోలుకొని మళ్లీ భారత జట్టులో చేరాలని కోరుకుంటున్నారు.