Harbhajan Singh:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ఇది క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వినోదాత్మక టోర్నమెంట్గా మారింది. 17 ఏళ్ల క్రితం ఐపీఎల్ మొదటి సీజన్లోనే టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్పై చేయి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని ఎవరూ మర్చిపోలేరు. ఈ ఘటనపై ఇంకా కుమిలిపోతున్నానని హర్భజన్ సింగ్ తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగిన 17 ఏళ్ల తర్వాత హర్భజన్ సింగ్ మళ్లీ తన తప్పుకు క్షమాపణలు చెప్పాడు.
17 ఏళ్ల క్రితం 2008 ఐపీఎల్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. ఐపీఎల్ 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబా(ఇప్పుడు పంజాబ్ కింగ్స్), ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ ఐపీఎల్ మొదటి సీజన్ హర్భజన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. కింగ్స్ ఎలెవన్ కు శ్రీశాంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో హఠాత్తుగా శ్రీశాంత్ చెంపపై హర్భజన్ సింగ్ కొట్టాడు. దాంతో భావోద్వేగానికి గురైన శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి హర్భజన్ శ్రీశాంత్ ను క్షమాపణ కోరాడు. ఆ సమయంలో హర్భజన్ సింద్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత ఐపీఎల్ 2008 మిగిలిన మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత హర్భజన్ సింగ్ మళ్లీ క్షమాపణలు చెప్పాడు.

ఎక్స్ వేదికగా ఓ అభిమాని ఈ చెంపదెబ్బకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి హర్భజన్ సింగ్ అభిప్రాయాన్ని అడిగాడు. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. "నేను చేసింది సరైనది కాదు. అది నా తప్పే.. నేను అలా చేసి ఉండకూడదు. కానీ నేను ఒక తప్పు చేశాను. నేను మనిషినే..దేవుడిని కాదు." అంటూ హర్భజన్ సింగ్ తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పాడు. హర్భజన్ సింగ్ తన తప్పుకు చాలా సార్లు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇద్దరు ఆటగాల్లు రాజీపడి మంచి స్నేహితులుగా ఉన్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే.. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శనివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.