హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోమవారం 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భజ్జీకి పలువురు క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్కి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ భజ్జీకి తన అధికారిక ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురైశ్ రైనా తదితరులు విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు.

హర్భజన్ సింగ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో ఫోటోలతో పాటు పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎప్పటిలాగే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో భజ్జీకి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు భజ్జీ గురించి ఓ సీక్రెట్ను బయటపెట్టాడు.
అతను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి సుమారు రెండు దశాబ్దాలు అవుతున్నా.. వీరూ చెప్పిన ఈ విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. కుటుంబాన్ని పోషించడం కోసం హర్భజన్సింగ్ కెనడా వెళ్లి ట్రక్ డ్రైవర్గా సెటిల్ అవుదామని అనుకున్నాడట. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచస్థాయి బౌలర్ అయ్యాడని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే టీమిండియా తరుపున భజ్జీ చివరిసారిగా గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా కప్లో పాల్గొన్నారు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్ టీమిండియా తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా చేశాడు. 2001లో ఆస్ట్రేలియాతో సిరీస్లో భజ్జీ తన విశ్వరూపం చూపించాడు. ఈ సిరీస్తోనే టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి ఇండియన్ బౌలర్గా భజ్జీ నిలిచాడు.