హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు అంటే క్రికెట్కు పెద్దన్నలా ఉండేది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో మ్యాచ్లంటే ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ ఓటమి తప్పదేమోన్న భావన ఒకప్పుడు ఉండేది. వేదిక ఏదైనా సరే, దేశం ఏదైనా సరే మైదానంలోకి ఆసీస్ జట్టు దిగిందంటే విజయం వారిదే.
మాజీ కెప్టెన్లు పాంటింగ్, క్లార్క్లు తమ హయాంలో ఆస్ట్రేలియా జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడమే కాదు వరల్డ్ కప్లను సైతం అందించారు. అలాంటి జట్టు ఇప్పుడు వరస ఓటములను మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించడం లేదు.

ఐదు వన్డేల సిరిస్ను 3-0తో మరో రెండు వన్డేలు మిగిలుండగానే చేజార్చుకుంది. భారత జట్టుతో ఇలా జరగడం చరిత్రలోనే మొదటిసారి. మరోవైపు శ్రీలంకది కూడా ఇదే పరిస్థితి. ఆ జట్టు ఇటీవల భారత్తో సొంతగడ్డపై జరిగిన టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటమిపాలైంది. అదే తరహాలో ఆసీస్ను కూడా టీమిండియా వైట్వాష్కు చేస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఆటతీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. 'ప్రస్తుత ఆసీస్ జట్టును చూస్తే.. శ్రీలంక జట్టు పసుపు రంగు జెర్సీ ధరించి ఆడుతున్నట్లుంది. ఐదు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో ఇప్పటికే సిరీస్ను దక్కించుకుందని, అలాగే 5-0 తో ఆస్ట్రేలియాను ఓడిస్తుంది' అని జోస్యం చెప్పాడు.
ఇదిలా ఉంటే గురువారం బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించిన అనంతరం హర్భజన్ సింగ్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తిరిగి జట్టులోకి రావాలని అందులో పేర్కొన్నాడు.