హైదరాబాద్: గురువారం నుంచి వెస్టిండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో సెలక్టర్లు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు దగ్గర్నుంచి, సీనియర్ ఆటగాళ్ల సైతం తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరాడు.
రోహిత్.. ధావన్లు ఇక టెస్టు మ్యాచ్లు ఆడరా??
ఈ మేరకు భజ్జీ తన ట్విట్టర్లో స్పందించాడు. "వెస్టిండీస్తో జరగబోయే టెస్టు సిరీస్లో భాగంగా భారత జట్టులో రోహిత్ శర్మను పరిగణలోకి తీసుకోలేదు. అసలు సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో అర్థం కావడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.. రోహిత్ను ఎందుకు ఎంపిక చేయలేదు తెలుసుకోవాలని ఉంది. దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నా" అని ట్వీట్ చేశాడు.
No @ImRo45 in test team against West Indies..what r the selectors thinking actually??? Anyone have a clue ??? plz let me know as I can’t digest this
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 30, 2018
వెస్టిండిస్ పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. "దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ విఫలమయ్యాడనే కారణంతో విండీస్తో సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో విఫలమైన కేఎల్ రాహుల్, పుజారాలను మళ్లీ ఎందుకు ఎంపిక చేశారు" అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
"ఆసియాకప్లో భాగంగా పాక్తో జరిగిన సూపర్-4 స్టేజ్ మ్యాచ్లో రోహిత్ తన శైలికి భిన్నంగా ఆడాడు. టెస్టుల్లో ఎలా ఆడాలో అదే తరహాలో రోహిత్ ఆట సాగింది. మరి ఆసియాకప్లో భారత జట్టు విజేతగా నిలిచింది కదా. అటువంటప్పుడు రోహిత్ను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియడం లేదు" అని మరొకరు ట్వీట్ చేశారు.
"రోహిత్ను విండీస్తో టెస్టు సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదు. క్రికెట్లో రాజకీయాల్ని చేర్చకండి. రోహిత్ను జట్టులోకి తీసుకోవడంపై సమాధానం చెప్పండి" మరొక నెటిజన్ నిలదీశారు.