హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జెట్ ఎయిర్ వేస్ పైలెట్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దివ్యాంగుడిని జెట్ ఎయిర్వేస్ పైలెట్ దూషించడమే కాకుండా దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని హర్భజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోడీని హర్భజన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ ఆ విదేశీ పైలెట్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ట్విట్టర్లో వరుసగా ట్విట్లతో మండిపడ్డాడు.
జెట్ ఎయిర్వేస్ పైలెట్ బెర్నాడ్ హోస్లిన్ దురహంకార ప్రవర్తనపై భజ్జీ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పరిణామం జెట్ ఎయిర్వేస్కు అవమానకరమని అతడు పేర్కొన్నాడు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పైలట్పై కఠిన చర్యలు తీసుకోవాలని భజ్జీ డిమాండ్ చేశాడు.
ఈ సంఘటన ఏప్రిల్ 3వ తేదీన జరిగిందని అతడు పేర్కొన్నాడు. మరోవైపు హర్భజన్ వ్యాఖ్యలపై జెట్ ఎయిర్వేస్ సైతం స్పందించింది. ఈ సంఘటనపై చింతిస్తున్నామని, పైలెట్పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని జెట్ ఎయిర్వేస్ సంస్థ వెల్లడించింది.
అంతేకాదు ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభించామని జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. తన ట్విట్టర్లో జరిగిన సంఘటనను వివరించిన హర్భజన్ సింగ్ ప్రధాని నరేంద్రమోడీని కూడా ట్యాగ్ చేయడం విశేషం. ఈ ఘటనపై మండిపడుతున్న నెటిజన్లు పైలెట్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.