
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఈ సీజన్ ఎంతో ప్రత్యేకం. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్పు నెగ్గిన నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్, ఈ సీజన్లో చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన హర్భజన్ సింగ్ కొన్ని మధురస్మృతులను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
'అదే స్టేడియం (ముంబైలోని వాంఖేడె)లో మేము 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సాధించాం. కానీ ఐపీఎల్లో పదేళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న మేము 11వ సీజన్లో ఒకే జట్టు తరఫున ఆడతామనుకోలేదు. ఈ విధంగా ప్రస్తుతం కప్పు నెగ్గుతామని ఊహించలేకపోయాం. వాంఖేడె మాకు కలిసొచ్చిందని' భజ్జీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 'ఔను.. మీ ఇద్దరికీ ఇది కలిసొచ్చిన మైదానం, ప్రపంచకప్ ఛాంపియన్స్, మీరే విజేతలు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో నిర్వహించిన వేలంలో హర్భజన్ను తీసుకునేందుకు ముంబw ఇండియన్స్ ఆసక్తి కనబరచకపోవడంతో చెన్నై అతన్ని సొంతం చేసుకుంది. అనుభవం ఉన్న స్పిన్నర్ జట్టులో ఉండాలన్న ధోనీ సలహా మేరకే భజ్జీని తీసుకున్నట్లు ఆ తర్వాత ఆ జట్టు యాజమాన్యం తెలిపిన సంగతి తెలిసిందే.
హర్భజన్ సింగ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో రీట్వీట్లు, లైక్స్ చేస్తున్నారు. తాజా విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. కాగా, గత కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు, హర్భజన్ సింగ్లు ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించారు.
ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్(117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో మూడో ట్రోఫీని అందుకున్న రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘతన సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు (2013, 2015, 2017)లో మూడు సార్లు ట్రోఫీని అందుకుంది. తద్వారా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.
2009లో రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ నాలుగు సార్లు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే, ఆదివారం జరిగిన పైనల్లో సన్రైజర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడంతో ఇప్పుడు అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ కూడా రోహిత్ శర్మ సరసన నిలిచారు.
రోహిత్ శర్మతో పాటు అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల(నాలుగు సార్లు) జాబితాలో ఈ ఇద్దరు కూడా చేరారు. ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ట్రోఫీలు నెగ్గినప్పుడు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.