
చెన్నై: గురువారం చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ను కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొనుగోలు చేసింది. గత మూడేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్లో కొనసాగిన భజ్జీని.. జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. చివరిసారి 2019 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన హర్భజన్.. అప్పటి నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూఏఈ వేదికగా జరిగిన 2020లో భజ్జీ ఆడలేదు. అయినా ఈసారి వేలంలో తన కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించి బరిలో నిలిచాడు. అయితే అతడిపై నమ్మకముంచిన కోల్కతా ఆ ధరకు కొనుగోలు చేసింది.
హర్భజన్ సింగ్ వేలంలో తనను తీసుకున్న కోల్కతా నైట్రైడర్స్కు ధన్యవాదాలు చెప్పాడు. గురువారం రాత్రి ఓ ట్వీట్ చేస్తూ ఆ జట్టుకు ఓ మాట కూడా ఇచ్చాడు. కేకేఆర్ మరో ట్రోఫీ గెలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. తనని ఆ జట్టులో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. తన నుంచి ఎల్లప్పుడూ వంద శాతం కచ్చితమైన ప్రదర్శన ఆశించొచ్చని భజ్జీ భరోసా ఇచ్చాడు. త్వరలోనే ఆ జట్టుతో కలుస్తానని సంతోషం వ్యక్తం చేశాడు. భజ్జీ ట్వీట్పై స్పందించిన కోల్కతా.. అతడి రాకను స్వాగతించింది. మరిన్ని వరుస విజయాలు అందించే ఆటగాడు వచ్చాడని, అతడి రాకతో మరింత ఆనందం నెలకొందని రీట్వీట్ చేసింది.
ఐపీఎల్లో ఇప్పటివరకు 160 మ్యాచ్లాడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న భజ్జీ 2019 సీజన్లో 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆ జట్టు ఫైనల్ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్లో హర్భజన్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది. దాంతో కోల్కతా ఇప్పుడు కొనుగోలు చేసింది. ఇక త్వరలో జరగనున్న 2021లో భజ్జీ తన మాట నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.
కోల్కతా కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
షకీబ్ అల్ హసన్ (రూ.3.2 కోట్లు), హర్భజన్ సింగ్ (రూ.2 కోట్లు), బెన్ కటింగ్ (రూ.75 లక్షలు), కరుణ్ నాయర్ (రూ.50 లక్షలు), పవన్ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షలు), షెల్డన్ జాక్సన్ (రూ.20 లక్షలు), వైభవ్ అరోరా (రూ.20 లక్షలు).