ముంబై: వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత నాలుగేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో కామెంట్రీ బాక్సులో మాత్రం సందడి చేస్తున్నాడు. 40 ఏళ్ల వయసున్న హర్బజన్.. 2016లో చివరిసారి ఆసియాకప్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి సీనియర్ ఆఫ్ స్పిన్నర్గా ఐపీఎల్లో మాత్రం రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత హర్భజన్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించాడు.
తాజాగా హర్భజన్ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 నా చివరి టోర్నీ అని చెప్పలేను. అది నా శరీరం సహకరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. గత నాలుగు నెలలుగా నా శరీరంకు పూర్తిగా విశ్రాంతి దొరికింది. ఈ ఖాళీ సమయంలో ఎక్కువగా వ్యాయామం చేశాను. మరోవైపు రెగ్యులర్గా యోగా కూడా చేశాను. దాంతో 2013 నాటి ఉత్సాహం ఇప్పుడు నాలో కనిపిస్తోంది. ఆ ఐపీఎల్ సీజన్లో నేను 24 వికెట్లు పడగొట్టాను' అని తెలిపాడు.
'నా బౌలింగ్ సామర్థ్యాన్ని ఇప్పటికీ పరీక్షించాలనుకుంటున్నారా.. నేను ఎప్పుడూ సిద్దమే. ఇటీవలకాలంలో అత్యుత్తమంగా రాణిస్తున్న యువ స్పిన్నర్తో పోటీపడేందుకు నేను రెడీగా ఉన్నాను. చాలా రోజుల నుంచి భారత జట్టుకి నేను దూరంగా ఉంటున్న మాట నిజమే. కానీ నాకు ఎవరి జాలి అవసరం లేదు. ఇప్పటికీ నేను భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలను. నేను ఒక నెలలో నెట్స్లో 2000 బంతులను బౌలింగ్ చేస్తే.. నేను అగ్రశ్రేణి క్రికెట్ ఆడినట్టే' అని హర్భజన్ సింగ్ చెప్పాడు.
రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తరఫున హర్భజన్ సింగ్ ఆడాడు. 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఇక 2019 ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచ్లాడిన భజ్జీ 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 160 మ్యాచ్లాడి.. 150 వికెట్లు నెలకూల్చాడు. ఐపీఎల్ టోర్నీలో భజ్జీ అత్యుత్తమ ప్రదర్శన 5/18. భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లాడిన హర్భజన్ సింగ్.. మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.
ఖేల్రత్న పురస్కారానికి గతేడాది తాను ఆలస్యంగా దరఖాస్తు చేశానని, ఈసారి తన పేరును తొలగించిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని హర్భజన్ సింగ్ అన్నాడు. ' ఖేల్రత్న అవార్డు జాబితా నుంచి పంజాబ్ ప్రభుత్వం నా పేరు తొలగించిందంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నిజమే.. ఖేల్రత్న అవార్డు కోసం నా పేరును సిఫారసు చేయడానికి నేను అర్హుడను కాదు. గత మూడేళ్ల ప్రదర్శన మేరకు ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. పంజాబ్ ప్రభుత్వం తన పేరును కావాలని తొలగించలేదు. మీడియాలోని స్నేహితులు ఈ విషయాన్ని గుర్తిస్తారని కోరుతున్నా' అని హర్బజన్ సింగ్ చెప్పాడు.
యూఏఈలో ఐపీఎల్ 2020.. చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటున్న ఫ్రాంచైజీలు!!