అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో తలపడనుంది. సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తుందనుకున్న టీమిండియాకు తొలి టెస్టులో బిగ్ షాక్ తగిలింది. మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం లభించి కూడా రోహిత్ సేన పరాజయాన్ని చవిచూసింది. ఆ షాక్తో పాటు టీమిండియాకు మరోసమస్య ఎదురైంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో అనుభవలేమి యువ బ్యాటర్లతో రోహిత్ శర్మ జట్టును ఎలా నడిపిస్తాడని ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అంతేగాక భారత జట్టు కూర్పుపై చర్చలు మొదలయ్యాయి. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రెండో టెస్టులో భారత తుదిజట్టును అంచనా వేశాడు. రజత్ పటిదార్ను కాకుండా సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు. అలాగే జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుదిజట్టులో చోటు సంపాదించుకుంటాడని తెలిపాడు. విరాట్ కోహ్లి స్థానంలో రజత్, రాహుల్ ప్లేస్లో సర్ఫరాజ్, జడేజా స్థానంలో సుందర్, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

''సర్ఫరాజ్ ఖాన్ అయిదో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. దేశవాళీ క్రికెట్లో అతడు పరుగుల వరద పారించాడు. ఇంగ్లాండ్ లయర్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా-ఎ జట్టులోనూ అదరగొట్టాడు. అయితే జట్టులో 11వ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉండాలి. కుల్దీప్ వైవిధ్యంగా బంతులు వేయగలడు. అంతేగాక రెండు వైపుల బంతిని తిప్పగలడు. ఇటీవల జరిగిన వరల్డ్కప్లోనూ అతడు సత్తాచాటాడు. అదనపు స్పిన్నర్తో వెళ్లాలనుకుంటే కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలి. వికెట్ భిన్నంగా ఉంటే సిరాజ్కు అవకాశం ఇవ్వండి. కానీ టర్నింగ్ పిచ్గా భావిస్తే కచ్చితంగా కుల్దీప్ను ఎంపికచేయాలి'' హర్భజన్ అన్నాడు.
హర్భజన్ సింగ్ అంచనా వేసిన భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్/మహమ్మద్ సిరాజ్
భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్