భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నంతవరకు ఆ దేశంతో క్రికెట్ ఆడటం సరైనది కాదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా, సినీ దర్శకుడు రాజ్ కుంద్రాతో కలిసి అమృత్సర్లోని సచ్ఖండ్ శ్రీ హర్మందిర్ సాహిబ్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నంత కాలం పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం సరికాదని ఆయన అన్నారు. "ఒకవైపు మన సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే, మరోవైపు పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం తప్పు. సంబంధాలు బాగా లేనప్పుడు వ్యాపారం కానీ, క్రికెట్ కానీ జరగకూడదు" అని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు.
దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు
ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే తుది నిర్ణయం బీసీసీఐ, భారత ప్రభుత్వం తీసుకోవాలని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని.. మన జవాన్ల త్యాగం క్రికెట్ మ్యాచ్ కంటే చాలా గొప్పదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 14న దుబాయ్లో ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పుల్వామా దాడిని ప్రస్తావించిన హర్భజన్
జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ దాడిలో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థ 26 మందిని చంపింది. దీనికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్థాన్కు గట్టి జవాబు ఇచ్చింది. ఈ ఘటన తర్వాత, భారత ఆటగాళ్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో పాకిస్థాన్కు వ్యతిరేకంగా మ్యాచ్ ఆడకుండా బహిష్కరించారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ఆటగాళ్ళు ఆశ్చర్యపోయారు.
'మెహర్' సినిమాపై ప్రశంసలు
ఈ సందర్భంగా హర్భజన్ గీతా బస్రా, రాజ్ కుంద్రా నిర్మాణంలో రాబోతున్న 'మెహర్' సినిమాను అభినందించారు. ఇది ప్రేక్షకులకు ఒక అందమైన బహుమతి అని, ఈ సినిమా వినోదాన్ని మాత్రమే కాకుండా ప్రజలకు స్ఫూర్తిని కూడా ఇస్తుందని, ఇది పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో పెయింటింగ్ ఆర్టిస్ట్ జగ్జోత్ సింగ్ రూబల్ హర్భజన్, గీత దంపతులకు ఒక ప్రత్యేక చిత్రాన్ని బహుకరించారు.