
హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్కు ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్తో ప్రాక్టీస్ చేసిన టీమిండియా బ్యాట్స్మెన్కు ఏ మాత్రం లాభం లేకుండాపోయింది. ఈ ఇంగ్లాండ్ టెస్టుకు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్.. అర్జున్ టెండూల్కర్తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. ఇక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అమ్ముతున్నవి ఏమిటో తెలుసా..? రేడియోలు..!
ఔను నిజమే. ఇదేదో ప్రచార చిత్రం కాదు. సరదాగా మాత్రమే తీసుకుంది.. అంతకంటే కాదు. శనివారం లార్డ్స్ మైదానంలో అతడు రేడియోలు అమ్ముతూ హర్భజన్ కంట పడ్డాడు. హర్భజన్ అతడితో ఫొటో దిగేసరికి అర్జున్ 50 రేడియోలు అమ్మాడట. మరికొన్ని మాత్రమే ఉన్నాయి.. త్వరపడండని హర్భజన్ ట్వీట్ చేస్తే గానీ.. ఈ రేడియో కుర్రాడి కథ వెలుగులోకి రాలేదు. మరి అర్జున్ అక్కడ ఎందుకు ఉన్నాడు.. అలా ఎందుకు చేస్తున్నాడన్నదే సందేహం వచ్చే ఉంటుంది.
చాలా కాలంగా అర్జున్ లార్డ్స్లోని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్లో మ్యాచ్ల సమయంలో అక్కడికొచ్చే జట్ల ప్రాక్టీస్ కోసం ఆ క్లబ్లోని కుర్రాళ్లు తోడ్పడతారు. మ్యాచ్ల సమయంలో మైదానంలో అవసరమైన పనులూ చేస్తారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా.. పిచ్ను కప్పివుంచేందుకు అర్జున్ అక్కడి గ్రౌండ్ సిబ్బందికి సహాయం కూడా చేశాడు.
ప్రేక్షకులు మ్యాచ్ను వీక్షించడంతో పాటు.. వ్యాఖ్యానం వినేందుకు వీలుగా.. ప్రత్యేకంగా రూపొందిన రేడియోలను లార్డ్స్లో విక్రయిస్తారు. ఇలాంటి రేడియోలనే అర్జున్ టెండూల్కర్ అక్కడ అమ్ముతున్నాడట. ఈ విషయంపై లార్డ్స్ క్రికెటె్ గ్రౌండ్ ఓ ట్వీట్ చేసింది. 'అతను మెక్ సైక్4ఎల్ క్లబ్లో శిక్షణ పొందడమే కాదు. తన వంతు సాయంగా మైదానంలో తిరిగి రేడియోలు అమ్మిపెడుతున్నాడు.' అంటూ పేర్కొంది.