హైదరాబాద్: భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే విషయంలో ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారనే విషయాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. వెస్టిండిస్ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఇటీవలే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్ Vs వెస్టిండిస్: విండిస్తో సిరిస్కు బౌన్సీ పిచ్లు, కారణం?
ఈ టెస్టు జట్టులో మిండియా యువ ఆటగాడు కరుణ్ నాయర్కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వరుసగా ఆరు టెస్టుల్లో (ఆప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు, ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులు) బెంచికే పరిమితమైన కరుణ్ నాయర్ను విండిస్తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి.
తాజాగా జట్టు ఎంపిక విషయంలో హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ "జట్టు ఎంపిక ప్రక్రియ ఓ రహస్యంలా కనపడుతోంది. మూడు నెలలుగా ఓ ఆటగాడిని బెంచికే ఎలా పరిమితం చేస్తారు? అతడు జట్టులో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు" అని కరుణ్ నాయర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
"భారత జట్టుని ఎంపిక చేసే ప్రక్రియలో ఒక్కో ఆటగాడికి ఒక్కో నిబంధన వర్తిస్తుందన్నట్లు పరిస్థితులు కనపడుతున్నాయి. విజయాలు సాధించేందుకు కొందరికే అవకాశాలను మెండుగా ఇస్తున్నారు. మరికొందరికి అస్సలు అవకాశాలు రావట్లేదు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు" అని హర్భజన్ సింగ్ అన్నాడు.
"ఒకవేళ వెస్టిండీస్తో జరిగే మ్యాచుల్లో హనుమ విహారీ విఫలమైతే? నేను అలా జరగాలని ఏ క్రికెటర్ విషయంలోనూ కోరుకోను. హనుమ విహారీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. కానీ, ఒకవేళ అతను బాగా ఆడలేకపోతే? తదుపరి టోర్నీకి మళ్లీ కరుణ్ నాయర్ను ఎంపిక చేస్తారు. అయితే, ఇలా జరిగితే ఆస్ట్రేలియాతో జరగనున్న టోర్నీలో కరుణ్ నాయర్ ఆత్మ విశ్వాసంతో ఆడగలడా?" అని హర్భజన్ ప్రశ్నించాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందైనా జట్టు ఎంపిక విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నానని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా, ఇప్పటి వరకు తన కెరీర్లో మొత్తం ఆరు టెస్టులాడిన కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఇక, విండిస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు గురువారం రాజ్ కోట్ వేదికగా ఆరంభం కానుంది.