వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్-2024లో భాగంగా పాకిస్థాన్ ఛాంపియన్స్తో తలపడిన మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 243 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కమ్రాన్ అక్మల్ (77; 40 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), షర్జీల్ ఖాన్ (72; 30 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), మక్సూద్ (51; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు ) సత్తాచాటారు.
ఆర్పీ సింగ్, అనురీథ్ సింగ్, ధావల్ కులకర్ణి, పవన్ నేగి తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. సురేశ్ రైనా (52; 40 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడాడు. ఓపెనర్లు అంబటి రాయుడు (39; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (22; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) పరుగులు చేశారు.

అయితే మ్యాచ్ అనంతరం ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ ఛాంపియన్స్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సీరియస్గా మాట్లాడుకున్నారు.సిబ్బంది వాళ్ల సంభాషణ ముగించాలని కోరినా.. కమ్రాన్ను భజ్జీ పక్కకి తీసుకెళ్లి మరి మాట్లాడాడు. అయితే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం కమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు హర్భజన్ క్లాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఉద్దేశిస్తూ ఓ న్యూస్ ఛానెల్లో కమ్రాన్ అక్మల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అర్షదీప్ సింగ్ను అవమానిస్తూ, సిక్కు మతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హర్భజన్ ట్విటర్ వేదికగా అప్పుడే తీవ్రంగా స్పందించాడు. సిక్కుల గురించి నోరుజారక ముందే చరిత్ర తెలుసుకోవాలని, చేసిన మేలు గుర్తుంచుకోవాలని మండిపడ్డాడు. ఆ తర్వాత కమ్రాన్ అక్మల్ కమ్రాన్ అక్మల్ భజ్జీకి, సిక్కుల కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాడు. బాధపెట్టాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని పాక్ క్రికెటర్ వివరణ ఇచ్చాడు. తాజాగా దాని గురించే వీరిద్దరు నేరుగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.