
ముంబై: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. హర్భజన్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ గీతా భస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్ను సోషల్ మీడియా ద్వారా భజ్జీ అభిమానులకి తెలియజేశాడు. హర్భజన్ , గీతాలకి ఇప్పటికే నాలుగేళ్ల పాప హినయా ఉంది. 2016 నుంచి భారత జట్టుకి దూరంగా ఉంటున్న హర్భజన్.. ఇప్పటివరకు రిటర్మెంట్ మాత్రం ఇవ్వలేదు. జాతీయ జట్టుకు ఆడకున్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున మూడు మ్యాచ్లు భజ్జీ ఆడాడు.
భగవంతుడి దయ వల్ల గీతా భస్రా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 'మేం చేయి పట్టుకుని నడిపించేందుకు ఓ చిన్ని చేయి. తన ప్రేమ స్వర్ణం అంతటి విలువైనది.. అద్భుతమైన బహుమతి.. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జీవితాలు పరిపూర్ణమయ్యాయి. పండండి మగబిడ్డను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. గీతా భస్రా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు' అంటూ హర్భజన్ తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. తన ట్వీట్టుకు చిన్నారి షూ ఫొటో జత చేశాడు. సహచరులు, అభిమానులు సోషల్ మీడియాలో భజ్జీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
29 అక్టోబర్ 2015న హర్భజన్ సింగ్, గీతా భస్రా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గీతా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భజ్జీకి పరిచయమవగా.. ఆ తర్వాత ఇద్దరూ కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2016లో ఈ దంపతులకు ఓ అమ్మాయి జన్మించింది. ఆమె హినయా హీర్ ప్లహా. ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు గీతా ప్రకటించారు. గీతా భస్రా బాలీవుడ్లో 'దిల్ దియా హై', 'ది ట్రైన్', 'సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్' వంటి సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే భజ్జీని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇప్ప్పుడు హౌస్ వైఫ్గానే ఉన్నారు.
హర్భజన్ సింగ్ భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 298 టీ20లు ఆడాడు. 2016లో టీమిండియాకి దూరమైన తర్వాత.. క్రమంగా దేశవాళీ క్రికెట్లోనూ మ్యాచ్లు ఆడటం మానేశాడు. ప్రస్తుతం ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్కి (చెన్నై సూపర్ కింగ్స్) దూరంగా ఉన్న హర్భజన్ .. ఐపీఎల్ 2021 సీజన్లో కోల్తా నైట్ రైడర్స్ తరఫున కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ మూడు మ్యాచ్ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దాంతో.. తర్వాత నాలుగు మ్యాచ్లూ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్నాయి.