సున్నాతో మొదలైన ధోనీ కేరీర్..
ధోనీ వన్డే కేరీర్ సున్నాతో మొదలైందనే విషయం చాలామందికి తెలుసు. ఆడిన తొలి వన్డేలోనే డకౌట్ అయ్యాడు ధోనీ. ఎదుర్కొన్నది కూడా ఒక్క బంతినే. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు ధోనీ. 2004 డిసెంబర్ 23వ తేదీన చిట్టాగాంగ్లోన మహమ్మద్ అజీజ్ స్టేడియంలో తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 245 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ టీమిండియా విజయం సాధించినప్పటికీ.. ధోనీ సున్నాకే అవుట్ అయ్యాడు. ఒక్క బంతికే రనౌట్ అయ్యాడు.
విశాఖపట్నంలో ధోనీ మరపురాని ఇన్నింగ్..
విశాఖపట్నంలో 2005 ఏప్రిల్ 5వ తేదీన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ మహేంద్రసింగ్ ధోనీ కేరీర్ను నిలబెట్టింది. ఈ మ్యాచ్లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 148 పరుగులు చేశాడు. పటిష్టమైన పాకిస్తాన్ బౌలింగ్ను తుక్కు తుక్కు చేశాడు. ధోనీ దెబ్బకు టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అప్పటి నుంచీ ధోనీకి.. జార్ఖండ్ డైనమేట్ అనే పేరు పెట్టారు అభిమానులు.
అత్యధిక వన్డేలు..
ప్రస్తుతం ధోనీ అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 348 వన్డేలు, 90 టెస్టుమ్యాచ్లు, 98 టీ20లను ఆడాడు. ధోనీ కేప్టెన్సీలో అపురూప ఘన విజయాలను అందుకుంది టీమిండియా. 2007లో తొలిసారిగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత క్రికెట్ జట్టు గెలుచుకుంది. 2011లో ప్రపంచకప్ను తన సొంతం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లల్లోనూ ధోనీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చాడు. 2011లో ఫైనల్లో ధోనీ ఎలా ఆడాడో అభిమానులు ఎప్పుడూ మరిచిపోలేరు.
ధోనీ పుట్టినరోజున సరదాలతో సందడిగా..
ధోనీ పుట్టినరోజును పురస్కరించుకుని టీమిండియా బ్యాట్స్మెన్లు సరదాగా గడిపారు. కేక్ కట్ చేశారు. ధోనీ భార్య సాక్షి, కుమార్తె జివాలతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై పోస్ట్ చేశారు. క్రికెటర్లు కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ధోనీని కలిసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.