ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లో రాజకీయ కుట్రలకు బాధితుడ్ని అయ్యానని ఆరోపించిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. విహారికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఓ క్రికెటర్ను మందలించాననే కారణంతో తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారి పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేనని, జీవితంలో ఆంధ్ర జట్టు తరఫున ఆడనని విహారి ప్రకటించాడు. కాగా,ఆ సదరు ప్లేయర్ తానేనని పరోక్షంగా ఆంధ్ర జట్టు బ్యాకప్ వికెట్ కీపర్ కేఎన్ పృథ్వీ రాజ్ స్పందించాడు. హనుమ విహారి ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ రోజు ఏం జరిగిందో జట్టు మొత్తానికి తెలుసని, సానుభూతి గేమ్స్ ఆడుకో అంటూ విమర్శలు గుప్పిస్తూ పృథ్వీ రాజ్ పోస్ట్ చేశాడు.

దీనికి హనుమ విహారి దీటుగా బదులిచ్చాడు. తనను కెప్టెన్గా తొలగించవద్దంటూ జట్టులోని ఆటగాళ్లంతా అసోసియేషన్కు రాసిన లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ లేఖలో హనుమ విహారినే కెప్టెన్గా కొనసాగించాలని, ఆయన ఎవర్నీ కూడా వ్యక్తిగతంగా దూషించలేదని జట్టులోని ఆటగాళ్లంతా పేర్కొన్నారు. పృథ్వీ రాజ్ అధికార ప్రభుత్వానికి చెందిన తిరుపతి కార్పోరేటర్ కుమారుడు, వైకాపా కీలక నేత ప్రధాన అనుచరుడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో విహారికి మద్దతుగా తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేయడం ఈ వివాదం మరింత హాట్ టాపిక్గా మారింది. ''వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఎప్పటికీ ఆడనని ప్రకటించే స్థాయికి అంతర్జాతీయ, భారత గొప్ప క్రికెటర్ అయిన హనుమ విహారిని టార్గెట్ చేశారు''
''హనుమ విహారి.. మీరు ధైర్యంగా ఉండండి. ఆట పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతే సమాధానం చెబుతాయి. ఈ అన్యాయమైన చర్యలు.. ఏపీని, ప్రజల స్ఫూర్తిని ప్రతిబింబంచవు. మీకు అండగా మేముంటాం. న్యాయం జరిగేలా చూస్తాం'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.