
మెల్బోర్న్: రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ ఆజింక్య రహానే క్లిష్టపరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ తో మెరవడం, బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించడంతో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. రహానే సెంచరీ (112)తో తొలి ఇన్నింగ్స్లో భారత్ 131 పరుగుల విలువైన ఆధిక్యం సంపాదించింది. అరంగేట్ర టెస్టులోనే యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. మొత్తానికి భారత్ సమిష్టి కృషితో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుని సిరీస్ని 1-1తో సమం చేసింది.
మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారి.. స్టాండ్స్లో ఉన్న ఓ అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్దకు వస్తున్న విహారిని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. 'తొందరగా ఔట్ జేసేయండి' అని అన్నాడు. 'ఔట్ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని అభిమానికి విహారి సమాధానం ఇచ్చాడు.
ఆస్ట్రేలియా త్వరగా ఆలౌట్ అయితే ఆ తర్వాత భారత్ ఛేదనకు దిగి సులువుగా విజయం సాధిస్తుందని, దీంతో మ్యాచ్ తొందరగా ముగుస్తుందనే ఉద్దేశంతో మన తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఇలా సరదాగా అభిమానితో అన్నాడు. ఆ అభిమాని మాత్రం మ్యాచ్ తొందరగా ముగిసిపోవాలని ఆశించి అలా సరదాగా అన్నాడు. కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా.. ఉన్నంతసేపు ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
బాక్సింగ్ డే టెస్ట్తో ఐదు రోజుల క్రికెట్లోనూ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచులోనే ఐదు వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. తొలి టెస్ట్ ఆడిన తన అనుభవాన్ని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్తో తాజాగా పంచుకున్నాడు. శ్రీధర్ కూడా హైదరాబాదీ వాసే అన్న సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరూ పక్కా హైదరాబాదీ యాసలో (హిందీలో మాట్లాడుకున్నా) మాట్లాడుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.