టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ బై చెప్పారు. త్రిపురకు ప్రాతినిథ్యాన్ని వహించనున్నాడు. 2025-26 సీజన్ దేశవాళీ క్రికెట్ లో అతను త్రిపుర తరఫున ఆడబోతోన్నాడు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) నుండి ఎన్ఓసీ కూడా మంజూరయింది.
31 ఏళ్ల హనుమ విహారి ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ఎంపిక కాకపోవడమే. ఈ విషయాన్ని హనుమ విహారి అధికారికంగా వెల్లడించాడు. కొత్త అధ్యాయం మొదలైంది..అంటూ తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

ఆంధ్రా క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి గల కారణాలను క్లుప్తంగా వెల్లడించాడిందులో. ఆదివారం ఎన్ఓసీ కోసం హనుమ విహారం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు దరఖాస్తు చేసుకోగా- 24 గంటల్లోనే మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో ఏసీఏతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్టయింది.
2023-24 సీజన్ ప్రారంభంలో కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఏసీఏలో రాజకీయ జోక్యం ఉందని హనుమ విహారి ఆరోపించిన విషయం తెలిసిందే. గత సీజన్లోనే జట్టును మార్చాలని ఆయన భావించాడు. మధ్యప్రదేశ్రి చర్చలు జరిపాడు. అధికార పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. ఆయన జట్టు మారకుండా ఒప్పించారు.
ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు హనుమ విహారి. గత సీజన్లో టీ20లకు ఎంపిక చేయట్లేదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తనకు తెలియజేసిందని, అప్పుడు తాను విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడదలచుకోలేదని వెల్లడించానని తెలిపాడు.
"నారా లోకేష్ నాకు ఫోన్ చేసి, అన్నీ నీ చేతిలో ఉంటాయని హామీ ఇచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు. నాకు అసోసియేషన్ నుండి మద్దతు లభించలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. నేను ఈ రాజకీయాలన్నిటిలోకి వెళ్ళదలచుకోలేదు. క్రికెట్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను" అని విహారి తెలిపారు.
ఇటీవల ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో హనుమ విహారి అమరావతి రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ లీగ్లో ఆయన జట్టు రన్నరప్గా నిలిచింది. విహారి ఏడు మ్యాచ్లలో 299 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు.
31 ఏళ్ల హనుమ విహారి 2018 నుంచి 2022 మధ్య భారత్ తరపున 16 టెస్టు మ్యాచ్లలో పాల్గొన్నారు. దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 84 మ్యాచ్లలో (ఆంధ్రకు 44, హైదరాబాద్కు 40) ఆయన 6168 పరుగులు సాధించారు. ఇందులో 14 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు అసోసియేషన్ పెద్దలు వివరించారని, తాను ఇంకా మూడు ఫార్మాట్లు ఆడగలనని భావిస్తున్నానని, వేరే చోట అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. తన కంటే మెరుగైన వారిని ఎంపిక చేసి ఉంటే ఫర్వాలేదని, అలా జరగలేదని పేర్కొన్నాడు. గతంలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన తనకు రావాల్సిన గౌరవం దక్కలేదనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.