
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితిలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో విహారి డబ్బు అందించడంతో ప్రియాంక అనే అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలంటోంది.
విషయంలోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఓ రోజు శ్రీకాంత్ ప్రపోస్ చేయగా.. ప్రియాంక నిరాకరించింది. దీంతో ఆవేశపడిన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంక గొంతును కోశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తం చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో సాయం చేయాలనీ కోరారు. విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ చేయించుకున్న ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్న హనుమ విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా.. వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందజేస్తున్నారు.
27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. ఆర్ అశ్విన్తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అతనికి అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం విహారి ప్రాక్టీస్ చేస్తున్నాడు.