

హైదరాబాద్: తన అంతర్జాతీయ తొలి టెస్టుని ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి తడబడుతూ ప్రారంభించాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు లభించింది.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టు మేనేజ్మెంట్ హనుమ విహారికి చోటు కల్పించింది. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా హనుమ విహారి టెస్టు క్యాప్ని అందుకున్నాడు. తద్వారా భారత్కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డులకెక్కాడు.
ఐదో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్లో రహానే ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన హనుమ విహారి ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఎదుర్కొన్న ఐదో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విహారి క్రీజులోకి వచ్చిన సమయంలో ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు. దీనికి తోడు బ్రాడ్ అద్భుత బంతులతో వణికించాడు.
అతడు వేసిన 36వ ఓవర్లో విహారి ఎల్బీ కోసం ఇంగ్లండ్ అప్పీల్ చేసినా అంపైర్ తోసిపుచ్చాడు. అయితే వీడియో రీప్లేలో ఇది అవుట్గా తేలినా వారు డీఆర్ఎస్కు వెళ్లకపోవడం లాభించింది. కానీ 38వ ఓవర్లో విహారి ఎల్బీ అయినట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూకు వెళ్లి నాటౌట్గా బయటపడ్డాడు.
రివ్యూలో బంతి స్టంప్స్కు దూరంగా వెళుతున్నట్లు కనిపించింది. అంపైర్ తప్పును దిద్దుకోవడంతో విహారి ఊపిరి పీల్చుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత తొలి పరుగు చేసే సమయంలోనూ అతనిలో తడబాటు కనిపించింది. కవర్స్లోకి బంతిని నెట్టి పరుగు తీసిన విహారి రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.
ఆ తర్వాత మ్యాచ్లో సమయం గడిచినకొద్దీ హనుమ విహారి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకున్నాడు. 29 బంతుల్లో తొలి రెండు పరుగులు మాత్రమే చేసిన విహారి.. ఆ తర్వాత 45వ ఓవర్లో సిక్స్, ఫోర్తో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కర్రాన్ బౌలింగ్లోనూ రెండు ఫోర్లతో సత్తా చాటుకున్నాడు.
అటు కోహ్లీ కూడా చెలరేగగా 18 బంతుల్లోనే 35 పరుగులు వచ్చాయి. అయితే స్టోక్స్ బౌలింగ్లో బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ.. రెండో స్లిప్లో రూట్కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం రిషబ్ పంత్(5) పరుగులకే పెవిలియన్కు చేరడంతో భారత్ 174/6తో మరింత కష్టాల్లో పడింది.
ఆ తర్వాత జడేజాతో కలిసి విహారి రోజును ముగించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. క్రీజులో విహారి (25 బ్యాటింగ్), జడేజా (8 బ్యాటింగ్) ఉన్నారు.