

హైదరాబాద్: వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో షమీ మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఉరి తీయమని చెప్తున్నాడు. భారత జట్టుకు ద్రోహం చేశానంటూ ఆరోపణలు వస్తున్న విషయంలో భార్యపై తీవ్రంగా మండిపడ్డాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన షమీ భార్యపై విమర్శలు సంధించాడు. వట్టి అబద్దాల కోరని పేర్కొన్నాడు.
హసీన్ మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తనతో రెండో పెండ్లి చేసుకుందని వాపోయాడు. తన పిల్లలను సైతం చెల్లి పిల్లలంటూ చెప్పుకొచ్చిందని తెలిపాడు. ఇప్పటికీ ఈ విషయంలో తన తల్లిదండ్రులు అబద్దాన్నే నమ్మతున్నారని వివరించాడు. షాపింగ్ కోసం డెబిట్ కార్డును విచ్చలవిడిగా వాడేదని, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు వజ్రాలు, బంగారం తీసుకురమ్మని చెప్పేదని ఆరోపించాడు. అయినా సరే పరిస్థితి ఇంతదాకా వచ్చిన తర్వాత ఇకపై కలిసి జీవించడం కుదరదని తేల్చేశాడు.
'భర్తగా ఆమెకు చేయాల్సినవన్నీ చేశాను. కానీ అబద్ధాలు చెబుతూ నన్ను వివాదంలోకి లాగింది. ఆమె కోసం రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టాను. షాపింగ్ల పేరుతో భార్య నా డెబిట్ కార్డులు మొత్తం ఇష్టమున్నట్లుగా వాడేసింది. దుబాయ్ నుంచి తనకు వజ్రాలు, బంగారు తీసుకురావాలని ఎప్పుడూ అడిగేది. ఆమె చేసే ఆరోపణలు చూస్తుంటే మేం మళ్లీ కలిసి జీవించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదని' షమీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నిన్నటివరకూ కేవలం గృహహింస కేసుతో సతమతమైన షమీకి నిన్నటి (బుధవారం) నుంచి కొత్త తలనొప్పి వచ్చి పడ్డ విషయం తెలిసిందే. హసీన్ చేసిన ఆరోపణల్లో ఒకటైన 'టెలిఫోన్ సంభాషణ'పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించారు. అయితే తనను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.