WPL 2025: హేలీ మాథ్యూస్ అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ 16వ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. బౌలింగ్ లో అమేలియా కెర్, బ్యాటింగ్ తో హేలీ మాథ్యూస్ రాణించడంతో యూపీ వారియర్స్ ను ఓడించి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ముంబై జట్టు 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో రెండో స్థానానికి చేరుకోగా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న యూపీ ఓటముల్లో హ్యాట్రిక్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 153 పరుగులు చేసి మ్యాచ్ ను గెలుచుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ తరపున హేలీ మాథ్యూస్ 46 బంతుల్లో 68 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. నాట్ సీవర్ 23 బంతుల్లో 37 పరుగులు చేసింది. ఈ ఇద్దరి బలమైన ఇన్నింగ్స్ కారణంగా ముంబై 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ తరపున గ్రేస్ హారిస్ 2 వికెట్లు పడగొట్టగా.. చినెల్లే హెన్రీ, క్రాంతి గౌడ్ తలో వికెట్ పడగొట్టారు.

ముంబైపై యూపీ తరపున బ్యాటింగ్ లో జార్జియా వాల్ హాఫ్ సెంచరీ చేసింది. ఈ మ్యాచ్ లో జార్జియా వాల్ 55 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ జట్టు తరఫున జార్జియా వాల్(55), గ్రేస్ హారిస్(28)లు శుభారంభం అందించారు. అనంతరం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో యూపీ వారియర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా యూపీ వారియర్స్ కెప్టెన్ దీప్తి శర్మ నిలదొక్కుకుంది. దీప్తి 25 బంతుల్లో రెండు ఫోర్లతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. సోఫీ ఎక్లెస్టోన్ 11 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ ఐదు వికెట్ల ఘనత సాధించగా.. హేలీ రెండు పికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్, పరుణిక తలో వికెట్ సాధించారు.