సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ పోరాడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70*; 105 బంతుల్లో) జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ అయిదు వికెట్లతో సత్తా చాటాడు. బర్గర్ రెండు వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ(5), యశస్వీ జైశ్వాల్ (17), శుభ్మన్ గిల్ (2) విఫలమయ్యారు. శ్రేయస అయ్యర్ (31), విరాట్ కోహ్లి (38) ఫర్వాలేదనిపించారు.
అయితే సీనియర్ బ్యాట్స్మన్ అజింక్య రహానె ప్రస్తుత భారత జట్టులో ఉంటే కథ మరోలా ఉండేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2022 ఏడాది ఆరంభంలోనే రహానె జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలు, యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని రహానెను సెలక్టర్లు పక్కనపెట్టారు. కానీ శ్రేయస్ అయ్యర్కు గాయమవ్వడం, ఐపీఎల్లో సత్తాచాటడంతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ఎంపికయ్యాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడినప్పటికీ రహానె గొప్పగా పోరాడు.

కాగా, తొలి రోజు ఆటలో కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవ్వడంతో రహానెను సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. 2018-19 పర్యటనలో జోహనెస్బర్గ్లో జరిగిన టెస్టు గురించి అతడు మాట్లాడాడు. ''అయిదేళ్ల క్రితం జోహనెస్బర్గ్ టెస్టు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. కానీ రహానె గొప్పగా ఆడాడు. రహానెను తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. కానీ ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా ఏం కోల్పోయిందో అతడు చూపించాడు''
'' ఎందుకంటే ఆ రెండు టెస్టుల్లో భారత్ పెద్ద తేడాతో ఓడిపోలేదు. రహానెకు విదేశాల్లో అపార అనుభవం ఉంది. అతడు ప్రస్తుత జట్టులో ఉంటే కథ మరోలా ఉండేది'' అని గవాస్కర్ అన్నాడు. ఆఖర్లో రహానె చేసిన 48 పరుగులు విజయంలో కీలకంగా మారాయి. ఆ మ్యాచ్లో భారత్ 63 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.