ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించడంతో దాదాపు మూడు నెలలుగా ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొందరు భారత క్రికెట్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ముంబైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో తాను చేసే పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
కరోనా కారణంగా క్రికెట్ మైదానానికి దూరమైన హార్దిక్ పాండ్యా.. తాజాగా సోదరులతో కలిసి క్యారమ్స్ ఆడాడు. పాండ్యా సోదరుడు కృనాల్తో పాటు మరో ఇద్దరు క్యారమ్స్ ఆడారు. ఫొటో బట్టి చూస్తే.. పాండ్యా సోదరులు ఒకవైపు కలిసి ఆడారు. దీనికి సంబందించిన ఫొటోను హార్దిక్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి 'క్యారమ్ విత్ మై బ్రదర్స్' అని టైటిల్ పెట్టాడు. 'నా సోదరులతో క్యారమ్.. గొప్ప ఆటలాగా ఏమీ లేదు. చాలా జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది' అని రాసుకొచ్చాడు.
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా స్పదించాడు. 'నీ టర్న్ కోసం వేచి చూస్తున్నావా?.. లేదా కృనాల్ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నావా?. నీ చేతులు బోర్డులో ఉన్నప్పటికీ.. నీ కళ్లు మాత్రం కృనాల్ మీదే ఉన్నాయి' అని కోహ్లీ కామెంట్ చేసాడు. ఫొటోలో హార్దిక్ స్ట్రైకర్ను కొడుతూ.. కృనాల్ వైపు చూస్తుండడంతో కోహ్లీ ఆలా కామెంట్ చేసాడు.
లాక్డౌన్ సమయంలో హార్దిక్ పాండ్యా జిమ్ చేసి కండలు పెంచాడు. తాను వర్కౌట్ చేస్తున్న వీడియోను హార్దిక్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తాను చేయడమే కాకుండా తన సోదరుడు కృనాల్ పాండ్యకు సవాల్ చేశాడు. 'స్ట్రాంగర్. ఫిట్టర్. ఇంకా నిర్మాణంలోనే ఉంది భాయ్. ఇంత కంటే బాగా వర్కౌట్ చేయాలని చాలెంజ్ చేస్తున్నా. భాయ్.. మీరు ఎన్ని చేయగలరో చూద్దామా' అని సవాల్ విసిరాడు. పాండ్యా వర్కౌట్ వీడియో చూసిన బాలీవుడ్ హీరోయిన్స్ సయామీ ఖేర్, కరిష్మా తనా ఫిదా అయ్యారు. 'ఇది బీభత్సం పాండ్యా' అని సయామి కామెంట్ చేయగా.. 'ఇది ఎలా చేశావు?. వావ్' అని కరిష్మా కామెంట్ చేసారు. అయితే హార్దిక్ సతీమణి నటాషా స్టాంకోవిచ్.. వారికి ఎమోజీలను పోస్ట్ చేసారు.
గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. పాండ్యా కోసం బీసీసీఐ కొన్ని రోజులు జట్టు ఎంపికను కూడా వాయిదా వేసింది. ఆపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు ఎంపికైనా.. అది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జరగలేదు. అయితే ప్రొటీస్ సిరీస్ ముందు హార్దిక్ తన ఫిట్నెస్ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్-1 తరఫున ఆడిన హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
అనుష్క సినిమా.. కోహ్లీ రివ్యూ!!