హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్పై కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ స్పందించింది. తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెను బద్దలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్మెహర్ చెప్పింది.
సోమవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో 'సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నాను. నేను పంజాబీని. సెహ్వాగ్ క్రికెట్ ఆడిన రోజుల్లో మొహాలీ స్టేడియంలో ఆయన పేరుని పలికాను. అయితే, తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ నిరాశను కలిగించింది' అని పేర్కొంది.
సోషల్ మీడియాను ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కంటే మరొకదానికి ఉపయోగించుకుంటే ఎంతో బాగుటుందని చెప్పుకొచ్చింది. కాగా, ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్మెహర్, తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ పోస్టు చేశారు. అంతేకాదు కార్గిల్ యుద్ధంలో తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధం చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె తన ఫేస్ బుక్ కవర్ పిక్గా పెట్టుకుని వార్తల్లో నిలిచింది.
దీంతో గుర్మోహర్ వ్యాఖ్యలకు సెహ్వాగ్ అదే తరహాలో ఓ ట్వీట్ని పోస్టు చేశాడు. అందులో సెహ్వాగ్ 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అనే ప్లకార్డుని పట్టుకుని ఉన్నాడు. సెహ్వాగ్ పోస్టు చేసిన ఈ ట్వీట్పై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఇందులో పలువురు సెలబ్రిటీలతో పాటు రచయితలు కూడా ఉన్నారు.
సెహ్వాగ్ ట్వీట్ని కొందరు సమర్థించగా.. మరికొందరు మాత్రం కార్గిల్ అమరవీరుడు కుమార్తె పట్ల సెహ్వాగ్ ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.