
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా టీమిండియాతో ఆదివారం జరుగనున్న చివరి వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ దూరం కానున్నాడు. వెన్నుముక గాయంతో బాధపడుతున్న గుప్టిల్ ఐదో వన్డే నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది. గుప్టిల్ స్థానంలో కొలిన్ మున్రో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో మార్టిన్ గుప్టిల్ ఘోరంగా విఫలమయ్యాడు. గత నాలుగు వన్డేల్లో అతను చేసిన పరుగులు 47. భారత్తో నాలుగో వన్డేలో గుప్టిల్ సిక్సర్, రెండు ఫోర్లతో దూకుడు మీద కనిపించనప్పటికీ 14 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.
కాగా, ఐదు వన్డేల సిరిస్ను ఇప్పటికే భారత్ 3-1తేడాతో కైవసం చేసుకుంది. వరుస మూడు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. నాలుగో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. ఇక చివరి వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ సిరీస్ను 4-1తో భారత్ గెలిస్తే కొత్త రికార్డును సృష్టిస్తుంది.
ఇప్పటివరకు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా నాలుగు వన్డేలను గెలిచిన దాఖలా లేదు. దీంతో చివరి వన్డేలో గెలిస్తే టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ఉదయం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.