హైదరాబాద్: ఐపీఎల్ అభిమానులను అలరిస్తున్న దానికి ధీటుగా బెట్టింగ్ తదితర వివాదాలు ఐపీఎల్ను చుట్టు ముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు పోలీసులు శనివారం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర్నుంచి కార్లు, బైకులు, టీవీలు, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుకీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. చేబ్రోలుకు చెందిన ఆలపాటి రామకృష్ణ రాజు ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెంలో క్రికెట్ బెట్టింగ్ సెంటర్లపై పోలీసులు దాడి చేశామన్నారు. బుకీలపై కేసులు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
కోయవారిపాలేనికి చెందిన నామా పూర్ణచంద్ర రావు బుకీగా వ్యవహరిస్తుండగా.. సీతా నగర్కు చెందిన వండ్రనపు వెంకటేష్, ఏటీ అగ్రహారానికి చెందిన కాకర్ల అరుణ్ బాబు, కోరిటపాడుకు చెందిన బొడ్లపాటి శివ నాగేశ్వరరావు, గుంటూరుకు చెందిన కోకిపాటి రామకృష్ణలు బెట్టింగ్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
కారు, రెండు బైకులు, టీవీలు, 13 సెల్ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు, రూ.2.97 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, బుకీలను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. మరో కేసులో సబ్ బుకీగా పని చేస్తున్న రవితేజను అరెస్ట్ చేశామని ఆయన వివరించారు.